ఆ సిలబస్లో గీతోపదేశాలు: ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కమల్ హాసన్
చెన్నై: మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఈ మధ్య వార్తల్లో తరచూ కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తనదైన శైలిలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా అన్నామలై యూనివర్శిటీ సిలబస్లో భగవద్గీత గురించి ప్రస్తావించడంపై కమల్హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం అనే అంశాన్ని విద్యార్థులపై రుద్దడం సరికాదన్నారు. ఫలాన వ్యక్తి ఫలానా మతంనే అనుసరించాలని చెప్పడం సరైన పద్ధతి కాదని, అలా చెప్పే హక్కు కూడా లేదని కమల్ హాసన్ ఫైర్ అయ్యారు.
గీతోపదేశాలు సిలబస్లో చేర్చడం ఏంటి?
విద్యార్థులు ఎప్పటికీ మంచి పుస్తకాలు చదివేందుకు సిద్ధంగా ఉంటారన్న కమల్ హాసన్, భగవద్గీతలో ఉన్న గీతోపదేశాలు సిలబస్లో చేర్చడం సరికాదన్నారు. ఒక మతాన్ని కొందరు వ్యక్తులు శాసించలేరని అన్నారు. మతస్వేచ్ఛపై మాట్లాడిన ఆయన... మత గురువులుగా తయారవుతారా లేక మతవ్యాపకులుగా తయారవుతారా అన్నది విద్యార్థులు నిర్ణయించుకోవాలని చెప్పారు.
విద్యార్థులపై మతంను బలవంతంగా రుద్దకండి
విద్యార్థులు చదువుతున్న కోర్సుకు సంబంధించిన పుస్తకాలు లేదా దానికి సంబంధించిన సిలబస్ను చదివేందుకు అనుమతించండి అని కమల్ హాసన్ చెప్పారు. అంతే తప్ప మతపరమైన అంశాలను వారి మెదళ్లలోకి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డారు. చదువులు పూర్తయ్యాక భవిష్యత్తుపై వారి సొంత నిర్ణయాలు తీసుకునేలా చూడాలంటూ చెప్పిన కమల్... వాళ్లు ఏమవ్వాలనుకుంటున్నారో అనేది సిలబస్ నిర్ణయించకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఫిలాసఫీ పేరుతో భగవద్గీతను సిలబస్లో ఎలా చేరుస్తారు?
అన్నా యూనివర్శిటీ సిలబస్లో సంస్కృతం చేర్చడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర ఖజగం (డీఎంకే) ధర్నా చేసింది. నిరసనలు తెలిపింది. అంతకుముందు సిలబస్లో భగవద్గీతను చేర్చడంపై సీరియస్ అయ్యారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. గవర్నర్ కలగజేసుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఫిలాసఫీ బోధించాలన్న ఉద్దేశంతో భగవద్గీతలోని ఉపదేశాలు సిలబస్లో చేర్చడాన్ని తను ఖండిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.
అన్నాడీఎంకే నేతలు పొటికల్ ట్రేడర్స్
ఇదిలా ఉంటే కమల్ హాసన్ తన పార్టీని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నడుపుతున్నారని అన్నాడీఎంకే నేత మంత్రి జయకుమార్ చేసిన కామెంట్స్ పై కమల్హాసన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్నాడీఎంకే కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను నడుపుతోందని తను కూడా అదే నడుపుతుండటంతో వారు తనకు పోటీదారులుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే నేతలు రాజకీయ వ్యాపారులని ఘాటు వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్.