సీబీఐ సాగా: విచారణ అంశాలు ఎలా లీక్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
రోజు రోజుకూ సీబీఐలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా అధ్వానంగా తయారవుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు సంబంధించి అత్యంత గోప్యంగా ఉండాల్సిన అంశాలు బయటకు ఎలా లీక్ అవుతున్నాయని ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మోడీ సర్కార్లోని ఓ మంత్రి ముడుపులు తీసుకున్నారని, మరో అధికారి విచారణలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జోక్యం చేసుకుంటున్నారని సీబీఐ డీఐజీ మనోజ్ కుమార్ సిన్హా తీవ్ర ఆరోపణలు చేయడంలాంటివి బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు లీకులపై కన్నెర్ర చేసింది. ఓ దశలో సీబీఐ వివాదంపై విచారణ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
దర్యాప్తులో భాగంగా అలోక్ వర్మ చెప్పిన అంశాలు బయటకు లీక్ కావడంపై వర్మ తరపున లాయర్ ఫాలి నారిమన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్లు విచారణ చేసే అర్హత పిటిషనర్లు కోల్పోయారని రంజన్ గొగోయ్ ఓ దశలో అసహనం వ్యక్తం చేశారు. విచారణను నవంబర్ 29న చేపడతామని చెప్పి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే తనను అన్యాయంగా ప్రభుత్వం సెలవుపై పంపిందని పేర్కొంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ.
అలోక్ వర్మపై జరిగిన విచారణకు సంబంధించిన నివేదిక మీడియాకు ఎలా లీకైందంటూ ప్రశ్నించిన న్యాయస్థానం మీడియా పేరు ప్రస్తావించకుండా దానికి సంబంధిచిన కాపీని అలోక్ వర్మ నాయ్యవాది ఫాలీనారిమన్కు అందజేసింది. "సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న మీపై గౌరవం ఉన్నందున మాత్రమే ఈ కాపీని అందజేస్తున్నామని అలోక్ వర్మ కేసును మీరు వాదిస్తున్నందుకు కాదు" అని ధర్మాసనంలో మిగతా జడ్జీలు జస్టిస్ ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్లు చెప్పారు.
న్యాయస్థానం ఇచ్చిన కాపీని చూసి తాను షాక్కు గురైనట్లు చెప్పారు నారిమన్. ఇక మీడియాకు బాధ్యత ఏముందని ప్రశ్నించారు. అంతేకాదు ఈ కాపీని న్యూస్ పోర్టల్లో పొందుపర్చిన యాజమాన్యానికి, జర్నలిస్టులకు సమన్లు జారీ చేయాలని కోర్టును కోరారు నారిమన్.