పెళ్లి, ఉద్యోగం పేరుతో బంధించి మూడేళ్లు రేప్చేశాడు: బాలిక ఫిర్యాదు
న్యూఢిల్లీ: పదహారేళ్ల నార్త్ ఈస్ట్ స్టేట్ బాలిక పైన గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమె పైన ఓ కిరాతకుడు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు పోలీసులు సోమవారం నాడు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అసోంకు చెందిన పదహారేళ్ల బాలిక జహీరుద్దీన్ అనే 27 ఏళ్ల వ్యక్తితో కలిసి ఢిల్లీకి వచ్చింది.
తనను సౌత్ వెస్ట్ ఢిల్లీ జనక్పురి ప్రాంతంలోని ఓ ఇంటిలో బంధించి అతను మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని ఢిల్లీకి తీసుకు వచ్చాడని తెలిపింది. అలాగే తనకు 18 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని పేర్కొంది.
అసోంలోని తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా అతను పరిచయమయ్యాడని తెలిపింది. అతని మాటలను నమ్మి తాను తన తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చానని చెప్పింది.
వారం రోజుల క్రితం అతను ఉద్యోగం వెతకడం కోసం వెళ్తున్నానని చెప్పాడని, అప్పటి నుండి తిరిగి రాలేదని, దీంతో తాను తనకు తెలిసిన బంధువులకు సమాచారం ఇచ్చానని తెలిపింది. మరో రెండు రోజులు చూసిన తాను తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లానని తెలిపింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, జ్యూడిషియల్ రిమాండుకు తరలించారు.
ఒడిశాలో అత్యాచారం, డిప్లోమా ఇంజనీర్ అరెస్ట్
ఒడిశాలో ఓ మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన కేసులో డిప్లోమా ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. నిందితుడు బాలిక పైన రెండు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.