ఈశాన్య మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే, ఎలాగంటే?: కిరణ్ రిజిజు, సంబరాలు
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఫలితాల ప్రకారం మేఘాలయాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 22 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఎన్పీపీ 14 స్థానాల్లో, బీజేపీ 6 చోట్ల, యూడీపీ 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
మేఘాలయాలోనూ మేమే
కాగా, మేఘాలయాలో కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, యూడీపీ, ఎన్పీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మిత్రపక్షాలతో కలిసి..
మేఘాలయాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీస మెజారిటీ స్థానాల సంఖ్య 31 కావడం గమనార్హం. బీజేపీకి మిత్రపక్షాలైన యూడీపీ, ఎన్పీపీలతో కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంబీజేపీకే ఎక్కువగా ఉంది.
మూడు రాష్ట్రాల్లోనూ పాగా
త్రిపురలో ఇప్పటికే బీజేపీ కూటమి 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, వామపక్ష కూటమి 21 స్థానాలతో వెనుకబడి పోయింది. అలాగే నాగాలాండ్లోనూ బీజేపీ జోరు కొనసాగుతోంది. బీజేపీ కూటమి 29 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఎన్పీఎఫ్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
శ్రేణుల సంబరాలు
ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అనూహ్య ఫలితాలను రాబట్టడంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయంటూ చెబుతున్నారు.