ఢిల్లీలో ఈశాన్య రాష్ట్ర స్త్రీ మృతి: తలపై బలమైన గాయాలు
న్యూఢిల్లీ: ఈశాన్య భారతానికి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో దేశ రాజధాని ఢిల్లీ మరణించింది. 24 ఏళ్ల ఆ మహిళ శవం గురువారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని ఆమె నివాసంలో బయటపడింది. మిజోరం రాష్ట్రానికి చెందిన ఆ మహిళ తలపై బలమైన గాయాలున్నాయి.
మహిళ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సఫ్దర్గండ్ ఆస్పత్రికి తరలించారు. తలకు తగిలిన గాయాలతో మరణించిన ఆమె శవం రక్తపు మడుగులో పడి ఉంది. హత్య కింద కేసు నమోదు చేశారు. మహిళతో పురుష భాగస్వామి వీరేందర్ సింగ్పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిందితులు తాగి ఉన్నారు...
ఇదిలావుంటే, కర్ణాటక రాజధాని బెంగళూర్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడిచేసినవారు తాగి ఉన్నట్లు చెబుతున్నారు. మైఖెల్పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కొత్తనూరు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అరుణ్ కుమార్, కరుణాకర్, జేమ్స్లను రౌడీ షీటర్లుగా పరిగణిస్తున్నారు. ముగ్గురిలో అరుణ్ కుమార్ పాత నేరస్థుడని, అతని బైక్ దొంగిలించిన కేసు ఉందని డిసిపి వికాస్ కుమార్ చెప్పారు.
కాగా, దాడి గురైన మైఖేల్ గురువారంనాడు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డిని కలిశాడు. తనపై దాడి చేసినవారు తాగి ఉన్నట్లు మైఖెల్ ఎంఎన్ రెడ్డికి చెప్పాడు. కారణం లేకుండానే తమపై వారు దాడి చేసినట్లు చెప్పాడు. తాను రెండున్నరేళ్లుగా సిటీలో ఉంటున్నానని, తనకు ఏ విధమైన ఇబ్బంది ఏర్పడలేదని కూడా మైఖేల్ చెప్పాడు.
బెంగళూరులో ఇద్దరు మణిపూర్ విద్యార్థులను చితకబాదిన విషయం మరవకముందే గుర్గావ్లో అలాంటి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. బాధితులు నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన వారు. గుర్గావ్లోని సికిందరపురలో ఏడుగురు స్థానికులు ఇద్దరు నాగాలాండు వ్యక్తులను బుధవారం రాత్రి పట్టుకొని చితకబాదారు. బ్యాట్లు, వికెట్లు, హాకీ స్టిక్స్తో చితకబాదారు. 25 ఏళ్ల వయసున్న అవాంగ్, చెస్టర్లు ఢిల్లీలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నారు. వారు గత రెండేళ్లుగా సికిందరపురలోనే ఉంటున్నారు.
వీరు తమ గదిలో ఉన్న సమయంలో బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఏడుగురు వచ్చి, వారిని వెజిటేబుల్ మార్కెట్ వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడే వారిని చితకబాదారు. వారి జుట్టు కత్తిరించారు. అంతేకాకుండా.. ఈ ప్రాంతంలో ఉన్న మీ నార్త్ ఈస్ట్కు చెందిన స్నేహితులకు ఫోన్ చేసి, ఈ ప్రాంతం విడిచి వెళ్లాలని చెప్పాలని బెదిరించారు. మణిపూర్, నాగాలాండ్ నుండి వచ్చే యువకులు ఇక్కడకు వచ్చి ఉంటే చంపేస్తామని వారు బెదిరించారని బాధితులు చెబుతున్నారు.