పాక్ ప్రజలకు వ్యతిరేకం కాదు, కావాలంటే సాయం చేస్తాం: రాజ్
న్యూఢిల్లీ: తాము పాకిస్తాన్ ప్రజలకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, తీవ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం నాడు అన్నారు. కులం, మతం ఆధారంగా వేర్వేరుగా చూడని దేశం భారత్ ఒక్కటే అన్నారు. భారత్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ కోరుకుంటే సాయం చేస్తాం
భారత్ తీవ్రవాదానికి వ్యతిరేకమని చెప్పారు. తమ దేశంలో తీవ్రవాదం ఉండవద్దని, దానిని ఏరివేద్దామని పాకిస్తాన్ అనుకుంటే భారత్ సాయం చేసేందుకు సిద్ధమని రాజ్ నాథ్ చెప్పారు. తీవ్రవాద మూలాలను పాకిస్తాన్లో తొలగించేందుకు ఆ దేశానికి సాయం చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు.
భారత్ బలహీనమైనది కాదని నిరూపించాం
పాకిస్తాన్ ప్రజలను తాము వ్యతిరేకించమని చెప్పారు. కానీ అక్కడి తీవ్రవాదాన్ని మాత్రం కచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్ ద్వారా భారత్ బలహీన దేశం కాదని నిరూపించామన్నారు. పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వచ్చి యూరి దాడి జరిపి, 19 మంది సైనికులను హతమార్చారన్నారు.
దీనిపై కొందరు ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. యూరి సర్జికల్ దాడి నేపథ్యంలో ఏం చేయలేకపోతుందని అన్నారని చెప్పారు. కానీ సైనికులు ఏం చేశారో అందరికీ తెలుసునని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్ ద్వారా సమాధానం చెప్పామన్నారు. ఈ దాడి ద్వారా భారత్ బలహీనం కాదని ప్రపంచానికి తెలియజేశామన్నారు.
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించి, స్నేహ హస్తం చాటామని చెప్పారు. తమ ప్రభుత్వం పేదవారి కోసం పని చేస్తోందన్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడే ఈ దేశాన్ని పేదవారికి డెడికేట్ చేశారన్నారు.