మాకు ఈరోజేం ముఖ్యమైనది కాదు: బీజేపీపై కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4గంటలకు సీఎం యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో జేడీఎస్ నేత, కాంగ్రెస్-జేడీఎస్ సీఎం అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తమకు అంత ముఖ్యమైన రోజేం కాదని అన్నారు.
తమకు ముఖ్యమైన రోజులు భవిష్యత్లో వస్తాయని కుమారస్వామి చెప్పారు. అంతేగాక, బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటల వరకు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుందని అన్నారు.
కర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివే
అయితే, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని కుమారస్వామి స్పష్టం చేశారు. ఏ ఒక్కరు కూడా వేరే పార్టీవైపు వెళ్లడం లేదని చెప్పారు. తాను, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కలిసి ముందుకు సాగుతున్నామని కుమారస్వామి తెలిపారు.
బలనిరూపణలో యడ్యూరప్పకు ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. యడ్యూరప్ప సర్కారు బలనిరూపణ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ ఎలాంటి తప్పులు చేయడానికి ఆస్కారమే లేదని పేర్కొన్నారు.
నేడే బలపరీక్ష: ప్రొటెం స్పీకర్ వివాదం, ఎమ్మెల్యేల ప్రమాణం, ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వం బల నిరూపణ పరీక్ష ఎదుర్కొనుంది. తమకు మద్దతుగా 120మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీజేపీ చెబుతుండటం గమనార్హం. ఇది ఇలా ఉంటే, సాయంత్రం 5గంటల తర్వాత సంబరాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం యడ్యూరప్ప.