వందేమాతరం గీతం ఆలపించడం తప్పనిసరి కాదు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం
వందేమాతరం ఒక్క రోజు ఆలపించడం వలన దేశభక్తి ఉన్నట్లు కాదని మధ్యప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి నెలా తొలిరోజున వందేమాతరం గీతాన్ని ఆ రాష్ట్ర సచివాలయంలో పాడతారు. అయితే ఇకపై అలాంటి పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది. 2005 నుంచి రాష్ట్ర సచివాలయంలో నెలలోని తొలిరోజున అక్కడి సిబ్బంది వందేమాతరం గీతం ఆలపిస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా మంగళవారం సిబ్బంది వందేమాతరాన్ని ఆలపించలేదు.
సీఎం కమల్నాథ్ సాధారణ పరిపాలన శాఖ పోర్ట్ఫోలియో తనదగ్గరే ఉంచుకున్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా పాడే వందేమాతరం ఒక్కసారిగా సచివాలయంలో నిలిచిపోవడంతో విపక్షాలు తమ నోళ్లకు పనిచెప్పాయి. సాధారణ పరిపాలన శాఖ పోర్ట్ ఫోలియో సీఎం కమల్నాథ్ తన దగ్గర ఉంచుకున్నారు కనుక వందేమాతరం సచివాలయంలో పాడటం ఎందుకు ఆపివేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనపై ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రజ్నీష్ అగర్వాల్. వందేమాతరం పాడటం నిలిపివేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు.
వందేమాతరం సచివాలయంలో పాడటం ఎందుకు ఆపివేశారో అని చెప్పేందుకు మంత్రులు అందుబాటులో లేరు. అది పొరపాటు జరిగి ఉంటుందని కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం మరో వెర్షన్ వినిపించారు. వందేమాతరం సెక్రటేరియట్లో పాడటం ఆపివేయాలన్న నిర్ణయం వెనక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. వందేమాతరం పాడటాన్ని తాము వ్యతిరేకించడం లేదని నెలలో ఒక్కసారి వందేమాతరం పాడి అది దేశభక్తి అని చెప్పడం తప్పని తాము భావిస్తున్నట్లు తెలిపారు కమల్ నాథ్. అంతేకాదు వందేమాతరం గీతం పాడనివారు దేశభక్తులు కారా అని ప్రశ్నించారు.