coronavirus: హోం క్వారంటైన్ నిబంధనలు బేఖాతారు, 47 మందిని ఇళ్లల్లో పెట్టి తాళం...
కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్లో ఉన్నవారు తిన్నగా ఇంట్లో ఉండటం లేదు. బయటకు రావొద్దని నెత్తి నోరు బాదుకున్న వినలేదు. దీంతో మధ్యప్రదేశ్ అధికారులు 47 మందిని కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో పెట్టి తాళం వేశారు. వారికి నిత్యావసర వస్తువులను అందచేస్తున్నామని, వైద్య సాయం ఉంటే ఫోన్ చేయాలని సూచించామని పేర్కొన్నారు.
ఛత్తర్పూర్ జిల్లాలో ల ఖజురహో, రాజ్ నగర్, పట్టణాల్లో కొందరినీ క్వారంటైన్లో ఉంచారు. అయినా వారు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్నారు. వారు ఇటీవల కరోనా వైరస్ సోకిన ప్రదేశాల్లో సంచరించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మార్చి 25వ తేదీ నుంచి పట్టణాల్లో కర్ప్యూ విధించారు. కానీ ఆ కుటుంబాలు తమకు సహకరించడం లేదని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్వామ్నిల్ పేర్కొన్నారు.
ఆ కుటుంబాలకు చెందినవారు గ్వాలియర్, భోపాల్, కాన్పూర్, అలహాబాద్, ఢిల్లీ ఇత ప్రాంతాలు సందర్శించి వచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని చెబితే మాత్రం వినిపించుకోవడం లేదు. ఆ కుటుంబసభ్యులు కూడా బయట తిరగడంతో వారందరినీ నిర్భందాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వారి ఇళ్లకు తాళం వేసే సమయంలో.. పై అధికారులను సంప్రదించామని పేర్కొన్నారు.
ఇంటి నిర్భందంలో ఉన్నవారికి అత్యవసర నంబర్ ఇచ్చామని.. సమస్యలపై వారు పట్వారీ, ఇతర అధికారులకు ఫోన్ చేస్తే స్పందిస్తారని తెలిపారు. అధికారుల చర్యను ఛతర్ పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చతుర్వేది ఖండించారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సింది పోయి.. అమానవీయంగా ప్రవర్తించడం సరికాదన్నారు.