కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ వ్యాఖ్యలు: కేరళకు కావాల్సింది ఆహారం, దుస్తులు కాదు...
వందల మంది చనిపోయారు... లక్షల్లో నిరాశ్రయులయ్యారు... చెట్టుకొకరు..పుట్టకొకరుగా మిగిలిపోయారు.. ఇది కేరళలో వరదలు సృష్టించిన భయానక వాతావరణం. కేరళలో ప్రజలను కాపాడేందుకు నిరంతరం రెస్క్యూ టీమ్లు పనిచేస్తున్నాయి. వారికి ఆహారం, నీరు, మందులు, అందజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేవ భూమిని ఆదుకునేందుకు చాలామంది విరాళాలు ఇస్తున్నారు. కానీ సుందరమైన రాష్ట్రం కేరళకు కావాల్సింది ఆహారం, దుస్తులు కాదు.. వరదలు తగ్గాక కేరళ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అవసరమైన సాంకేతికత కావాలంటున్నారు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్.
ఇప్పటికే కేరళలో వరదల ధాటికి 300కు పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు 20వేల కోట్ల మేర నష్టం సంభవించినట్లు అంచనావేశారు. 1924 తర్వాత ఇంత పెద్ద ఎత్తున కేరళ రాష్ట్రాన్ని ముంచడం ఇదే తొలిసారి. ప్రధాని వచ్చారు..ఏరియల్ సర్వే చేసి ఎమర్జెన్సీ కింద రూ. 500 కోట్లు విడుదల చేశారు. అంతకుముందు వచ్చిన రాజ్నాథ్ సింగ్ రూ.100 కోట్లు ఇస్తే... మరో మంత్రి కిరణ్ రిజుజు 80 కోట్లు ఇచ్చారు. డబ్బు కావాల్సినంత ఉంది. కానీ కేరళ రాష్ట్రాన్ని ముందులా నిర్మించేందుకు అవసరమయ్యే టెక్నికల్ స్టఫ్ కావాలంటూ మంత్రి ఆల్ఫోన్స్ చెప్పారు. లక్షమంది సహాయక శిబిరాల్లో ఉన్నారు. వారందరికి రాష్ట్రకేంద్ర ప్రభుత్వం తరపున ఆహారం నీరు మందులు దొరుకుతున్నాయి.
వరద ప్రభావం తగ్గాక కేరళ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కావాల్సిన నైపుణ్యత కలిగిన సాంకేతిక నిపుణులు రాష్ట్రానికి వచ్చి తమవంతు సహాయం అందించాలని ఆల్ఫోన్స్ కోరారు. ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు, మొబైల్ కనెక్టివిటీ లేదని చెప్పిన ఆల్ఫోన్స్ విద్యుత్ తిరిగి సరఫరా అయ్యేందుకు ఎలక్ట్రీషియన్లు కావాలని... నీటి సరఫరా పునరుద్ధరణకు ప్లంబర్లు కావాలని, వారంతా కేరళకు రావాలని ఆల్ఫోన్స్ కోరారు. కేరళ ప్రజాజీవనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సాంకేతికంగా నైపుణ్యత కలిగిన వ్యక్తులు కావాలని ఆల్ఫోన్స్ కోరారు.
ఇప్పటి వరకైతే ఆహారం పరంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ చెప్పారు. స్థానిక పండగ ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ముందస్తు చర్యల్లో భాగంగా ఆహార ధాన్యాలను నిల్వచేసుకున్నారని గుర్తు చేశారు. అయితే వాటిని రవాణా చేయడం కష్టతరంగా మారిందన్నారు. ఈ విపత్తుపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు ధైర్యంగా ముందుకు కదిలారని...ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పినరాయి విజయన్.
ఇదిలా ఉంటే కేరళలో భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొచ్చిలో ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలైనట్లు తెలుస్తోంది. చిన్న విమానాలు ఎగిరేందుకు అనుమతి లభించినట్లు సమాచారం.