వారణాసికి వెళ్లను.. ప్రచారం చేయడం లేదు: ప్రియాంక
అమేథి: తాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా స్పష్టం చేశారు. వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ప్రియాంక గాంధీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథి, సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తాను' అని తెలిపారు. అయితే వారణాసి నుంచి నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ తరపున తాను ప్రచారం చేస్తానన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
నరేంద్ర మోడీపై వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేస్తానన్నట్లు, అందుకు తనను పార్టీ అధిష్టానం అడ్డుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. తాను తన ఇష్ట ప్రకారంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు.
ఒక వేళ తాను పోటీ చేయాలనుకుంటే తనను ఎవరూ అడ్డుకోలేరని, తన నిర్ణయానికి తన తల్లి, సోదరుడు, భర్త రాబర్ట్ వాద్రాలు తనకు మద్దతుగా ఉంటారని ప్రియాంక గాంధీ చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది తన వ్యక్తిగత నిర్ణయమేనని ఆమె చెప్పారు. కాగా, యోగా గురువు బాబా రాందేవ్.. రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు ప్రియాంక గాంధీ నిరాకరించారు.
కాగా, అమేథిలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రియాంక గాంధీని కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కలిసి షేక్ హ్యాండిచ్చి మాట్లాడారు. ఇరుపార్టీల వారూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ప్రచారం కొనసాగించిన ప్రియాంక గాంధీ.. ఆప్ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్పై ఎలాంటి ఆరోపణలు చేయకుండా, బిజెపి అమేథి అభ్యర్థి స్మృతీ ఇరానీపైనే విమర్శలు గుప్పించినట్లు సమాచారం. అక్కడే బిజెపి కార్యకర్తలు ఉన్నప్పటికీ ప్రియాంక గాంధీ చేతులు కలపడానికి కాకుండా, అభివృద్ధిపై అడిగేందుకే వారు అక్కడి చేరుకున్నట్లు సమాచారం.