పేర్లు మార్చడానికి రాలేదు: లక్నోలో అసదుద్దీన్ ఓవైసీ, 22 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్, బీజేపీకి చురకలు
లక్నో: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు సాధించి కొత్త ఉత్సాహం మీదున్న ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం యూపీ రాజధాని లక్నో చేరుకున్నారు.
యూపీలో సత్తా చాటేందుకు..
2017లో జరిగిన యూపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఎంఐఎంకు ఒక్కసీటు కూడా రాలేదు. అయితే, ఈసారి మాత్రం గట్టి ప్రయత్నం చేసి ఖాతా తెరవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పట్నుంచే అసదుద్దీన్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీకి మాజీ భాగస్వామి అయిన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్భర్ను ఓవైసీ లక్నోలో కలుసుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో యూపీ సీఎం ప్రచారం..
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలనే రాబట్టాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న విషయం తెలిసిందే. హైదరాబద్ పేరును మారుస్తారా? అని కొందరు అడుగుతున్నారని.. ఎందుకు మార్చం తప్పకుండా మారుస్తాం అని యోగి స్పష్టం చేశారు. అంతేగాక, ఓవైసీ పైనా విమర్శలు చేశారు.
యోగి, అమిత్ షా ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదంటూ..
గ్రేటర్ పరిధిలో యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేసిన చోట్లలో బీజేపీ గెలుపు నమోదు చేయలేదని ఓవైసీ వ్యాఖ్యానించారు. తాను ఇక్కడికి పేర్లు మార్చడానికి రాలేదని.. హృదయాలను గెలుచుకునేందుకేనని ఆయన అన్నారు. కాగా, బీజేపీ మేయర్ పీఠం చేపడితే హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్ గా మారుస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
రాజ్భర్ పార్టీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ..
యూపీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన మరుసటి రోజే అసదుద్దీన్ యూపీకి వెళ్లడం గమనార్హం. కాగా, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకునే అవకాశాలు ఇప్పుడు లేదని ఓవైసీ చెప్పారు. రాజ్భర్ పార్టీ భాగస్వామ్యంతో యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన సంకేతాలిచ్చారు. తమ కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.