ఇక స్విగ్గి నుంచి అవి కూడా.. వచ్చే స్తాయ్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ ద్వారా ఆహార పదార్థాలను ఆర్డర్ తీసుకుని, సరఫరా చేస్తోన్న స్విగ్గి.. మరింత విస్తరించబోతోంది. ఆహార పదార్థాలకు సంబంధించిన ఆర్డర్లకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాలకు కూడా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో.. ఆహార పదార్థాల సరఫరాలో అగ్రగామిగా ఉంటున్న స్విగ్గి నుంచి నిత్యావసర సరుకులు కూడా రాబోతున్నాయి. కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు.. ఇలా అన్ని రకాల నిత్యావసర సరుకులను కూడా ఆర్డర్ చేయవచ్చు.
బియ్యం, పప్పులు, సబ్బులు, బొకేలు, అప్పుడే పుట్టిన పసికందులకు కావాల్సిన వస్తువులను కూడా సరఫరా చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా స్విగ్గి స్టోర్లను ఏర్పాటు చేయబోతోంది. సూపర్ మార్కెట్ల తరహాలో స్విగ్గి స్టోర్లు ఏర్పాటవుతాయని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఆయా స్టోర్ల నుంచి వినియోగదారులకు కావాల్సిన నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని అన్నారు. 2014లో బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన స్విగ్గి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 నగరాల్లో సుమారు 60 వేల రెస్టారెంట్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
తాజాగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీనే కాకుండా.. నిత్యావసర సరుకులు, కూరగాయల సరఫరాను కూడా ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు స్విగ్గి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఫుడ్ డెలివరి రంగంలో స్విగ్గి కూడా తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.
ప్రముఖ ఆన్ లైన్ కార్ల బుకింగ్ సంస్థ ఓలాకు అనుబంధంగా పని చేస్తోన్న ఫుడ్ పాండా, ఉబేర్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఉబేర్ ఈట్స్ తో పాటు జొమాటో వంటి సంస్థలు స్విగ్గికి బలమైన పోటీదారులుగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇతర రంగాలకు కూడా విస్తరించడానికి స్విగ్గి సన్నాహాలు చేస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో బిగ్ బాస్కెట్ మంచి మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంది. తాజాగా స్విగ్గి రాక వల్ల ఆన్ లైన్ ద్వారా సరుకుల డెలివరీలో పోటీ తీవ్రమౌతుందని అంచనా వేస్తున్నాయి.