పరాజయాన్ని ఈవీఎంలపైకి నెట్టేసిన ‘ఆప్’నేతలు.. కానీ ‘ఆమె’ మాత్రం...
ఢిల్లీ నగర పాలక ఎన్నికల్లో ‘ఆప్’ ఘోర పరాజయానికి కారణం ఈవీఎంలేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలంతా ఆరోపిస్తుండగా, ఒక్క చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబా మాత్రం భిన్నంగా స్పందించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ నగర పాలక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు పార్టీ పరాజయాన్ని ఈవీఎంలపైకి నెట్టివేస్తున్నారు. ఈవీఎంల టాంపరింగ్ వల్లే తమ పార్టీ ఓటమిపాలైందని కేజ్రీవాల్ బృందం ఆరోపిస్తోంది.
ఢిల్లీలో క్లీన్ స్వీప్ ప్రధాని నరేంద్ర మోడీ మాయ కాదని, ఈవీఎంల మాయ అంటూ 'ఆప్ ' నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ పార్టీలోని ఒక్కరు మాత్రం వీరికి భిన్నంగా స్పందించారు. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని అంటున్నారు.
పార్టీ ఓటమిపై ఆప్ నేత, చాందినీచౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబా మాట్లాడుతూ.. 'నా ప్రాంతంలో ఈవీఎంలలో సమస్యలేమీ రాలేదు. ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థులకు మా మద్దతు ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, పార్టీలో లోపాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. ఓటమికి బాధ్యత వహిస్తా' అని పేర్కొన్నారు.
ఢిల్లీ నగర పాలక ఎన్నికల్లో భాజపా జయకేతనం ఎగరవేయగా.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో చాందినిచౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముగ్గురు ఆప్ అభ్యర్థులు ఓడిపోయారు.