సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ ముమ్మాటికీ బూటకమే: సీబీఐ
ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి వచ్చింది సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసు. సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు ముగిశాయి. సీబీఐ తన తుది వాదనలను వినిపించింది. సోహ్రాబుద్దీన్ది బూటకపు ఎన్కౌంటరే అని వాదించింది సీబీఐ. 2005లో రాజస్థాన్, గుజరాత్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగిందని... 2006లో తులసీరామ్ ప్రజాపతి ఎన్కౌంటర్ జరిగిందని గుర్తుచేసిన సీబీఐ, రెండూ బూటకపు ఎన్కౌంటర్లే అని పేర్కొంది. సీబీఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీపీ రాజు... కోర్టుముందు సీబీఐ ఉంచిన ఆధారాలను పరిశీలిస్తే అది కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్ అన్న విషయం అర్థమవుతుందని న్యాయస్థానానికి తెలిపారు.
సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్కు సంబంధించి రాజస్థాన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చారని చెప్పిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.... అందులో సోహ్రాబుద్దీన్కు ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా, ఐఎస్ఐలతో సంబంధం ఉన్నట్లు సృష్టించడమే కాదు... ఒక బడా రాజకీయనేతను హత్యచేసేందుకు కుట్రపన్నినట్లు తప్పుగా నివేదిక తయారు చేశారని కోర్టుకు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజు. అంతేకాదు సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ తర్వాత అతని జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అది రక్తంతో తడిసిపోయి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో సోహ్రబుద్దీన్ నుంచి సూరత్ టూ అహ్మదాబాద్ రైల్వే టికెట్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారని అయితే ఆ టికెట్టుపై మాత్రం ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో అనుమానం వచ్చిందని కోర్టుకు తెలిపారు పీపీ. అంతేకాదు కాల్ డేటా రికార్డులు కూడా మాయం అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్కౌంటర్తో సంబంధం ఉన్న పోలీసులను విచారణ చేయగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని పీపీ వాదించారు. బైకు పై సోహ్రాబుద్దీన్ వచ్చాడని చెబుతున్న పోలీసులు ఆ బైకు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో ఆ వ్యక్తి పేరు చెప్పలేకున్నారని కోర్టుకు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్.
సోహ్రాబుద్దీన్ స్నేహితుడు తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కూడా బూటకమేనని వాదించారు పీపీ. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి ప్రజాపతి పారిపోయాడనేది అవాస్తవం అని పీపీ చెప్పారు. అంతేకాదు తులసీరాం ప్రజాపతి నుంచి స్వాధీనం చేసుకున్న దేశీ తుపాకీపై ఆయన వేలిముద్రలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తులసీరాం ప్రజాపతి ఒక ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని... 2006, నవంబర్ 27న కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోగా... నవంబర్ 28న ఎన్కౌంటర్ పేరుతో ప్రజాపతిని చంపారని కోర్టుకు తెలిపారు. అయితే కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతున్న వ్యక్తి దగ్గర తుపాకి రావడం అనేది అసాధ్యం అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజు వాదించారు. నిందితుల తరుపున లాయర్లు కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.