ప్రధాని రేసులో లేను.. 270 స్థానాల్లో బీజేపీదే విజయం : గడ్కరీ
నాగ్పూర్ : ప్రధాని రేసులో లేనంటూ మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ. ప్రధాని కావాలనే ఆశ లేదని.. దానికి సంబంధించి తన పొలిటికల్ కెరీర్ లో ఎక్కడా మాట్లాడలేదని గుర్తుచేశారు. సోమవారం (25.03.2019) నాడు నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గడ్కరీ మీడియాతో మాట్లాడారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 270 స్థానాల్లో విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో కూడా ఈసారి బీజేపీ - శివసేన కూటమి హవా కొనసాగుతుందన్నారు గడ్కరీ. 40 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో కలుపుకుని బీజేపీ 300 కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. మోడీ ప్రభుత్వ పాలనపై దేశ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
నాగ్పూర్ సెగ్మెంట్ లో తనకు మద్దతు బాగానే ఉందని.. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుపొందుతానంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు. అందుకే ప్రజల ఆదరణ దక్కిందన్నారు. ప్రస్తుతానికి తన పనితీరు మెరుగ్గా ఉందని, తనకు అప్పగించిన పదవులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని పదవిపై ఎలాంటి ఆశ లేదని.. పార్టీ ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వ్యాఖ్యానించారు.