టీవీ చూస్తోంది, చదవడం లేదు : ఐదేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికం, దాడితో మృతి
తిరుచ్చి : పిల్లలపై సైకోల ప్రతాపం కొనసాగుతోంది. సాధారణంగా పిల్లలపై ఇరుగుపొరుగో .. లేదంటే వారి వయస్సు కన్నా పెద్దవారో దాడిచేస్తారు. చెప్పిన మాట వినడం లేదని తల్లి మందలిస్తోంది తప్పా .. చచ్చేవరకు కొట్టదు. కానీ తమిళనాడులో ఓ మహాతల్లి తన కూతురిపై తన పైశాచికాన్ని ప్రదర్శించింది. చిన్నారి చనిపోయేవరకు కొట్టి .. తన శాడిజాన్ని చాటుకుంది.
సైకోలా మారిన తల్లి ..
తిరుచ్చి జిల్లా కాట్టుపుదూరులోని ప్రభుత్వ పాఠశాలలో నిత్యకమల అనే వివాహిత టీచర్గా పనిచేస్తోంది. విద్యాబుద్దులు చెప్పే ఆ తల్లి .. తన కూతురు కూడా చదవాలనుకొంది. అందులో తప్పేం లేదు. అయితే తన ఐదేళ్ల కూతురు చదవడం కన్నా .. టీవీ ఎక్కువ చూడటం ఆమె ప్రకోపానికి కారణమైంది. ఎంత చెప్పినా వినడం లేదని చేతికి పనిచేప్పింది. ఎంతలా అంటే .. ఆ చిన్నారి గుక్కపట్టి ఏడ్చి .. ఏడ్చి .. తనువు చాలించేంత వరకు కొట్టి పేగుతెంచిన బిడ్డనే స్వహస్తాలతో కాటికి పంపింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయినా ఆమెకు అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో ... ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి లతికా శ్రీ కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
టీచర్ ప్రతాపం
ఐదేళ్ల చిన్నారిపై చదువు అనే అస్త్రం శాపంగా మారింది. చదవడం లేదని కన్నతల్లే కొట్టడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కాన్వెంట్ స్కూళ్ల చదువులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చిన్నారిని చితక్కొట్టిన తల్లి కూడా విద్యావంతురాలు. అదీ కూడా టీచర్ కావడం గమనార్హం. ఓ తల్లిలా కాక .. మంచి ఉపాధ్యాయునిగా కూడా ప్రవర్తించలేదని ఆరోపణలు వస్తున్నాయి. చదువు మాయలో పడి .. కన్నపేగును కడతేర్చే వరకు వెళ్లడం దేనికి సంకేతమని మేధావులు ప్రశ్నిస్తున్నారు. సమాజంలో ఈ వైఖరి మారాలని .. లేదంటే మరింత మంది చిన్నారులపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చేసిన తప్పేంటీ ?
ఆ చిన్నారి వయస్సు ఐదేళ్లు. అభం .. శుభం తెలియదు. చిన్ని చిన్ని మాటలతో ఆడుకోవడం .. ఫోన్లలో రైమ్స్ చూడటం .. అదీ కాకుంటే టీవీలో కార్డూన్ చూడటం. ఇదే వారి పని. అసలే సమ్మర్ హాలీడేస్ ఉన్నాయని .. దాదాపు చిన్నారులంతా వారి లోకంలో మునిగిపోతుంటారు. అందరిలాగే లతికా శ్రీ కూడా చేసింది. అయితే అదే ఆమె పాలిట శాపమైంది.