సావర్కర్కి కాదు, ఆ ముగ్గురికీ ఇవ్వండి భారతరత్న: ప్రధానికి మనీష్ తివారీ లేఖ
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీష్ తివారీ కోరారు. బ్రిటీష్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం జాతికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ప్రధాని మోడీకి రాసిన లేఖలో మనీష్ తివారీ పేర్కొన్నారు.
'బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ప్రాణత్యాగం జాతియావత్తులో జాతీయ భావాన్ని రగులుస్తూ నిరంతరం స్ఫూర్తినిస్తోంది. 1931, మార్చి 23న వారు ప్రాణత్యాగం చేశారు' అని మనీష్ తివారీ వ్యాఖ్యానించారు.
'2020, జనవరి 26న ఈ ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులకు భారతరత్న పురస్కారం ప్రకటించినట్లయితే అధికారికంగా షాహిద్ ఈ అజమ్గా గౌరవించినట్లవుతుందన్నారు. మొహాలీలోని చంఢీగఢ్ ఎయిర్పోర్ట్కు షాహిద్ ఈ అజమ్ భగత్ సింగ్ అని నామకరణం చేయడం జరిగింది. ఇది 126 కోట్ల భారతీయులను తాకింది' అని మనీష్ తివారీ అన్నారు. ఇంతకుముందు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు భారతరత్న ప్రకటించాలన్నారు.
My letter to H’onble Prime Minister @narendramodi formally requesting him to accord Bharat Ratna to Shaheed-E-Azam’s Bhagat Singh, Rajguru & Sukhdev.Formally Confer the honorific of Shaheed-E-Azam on them & dedicate Chandigarh Airport located in Mohali in memory of Bhagat Singhji pic.twitter.com/PfqduZq8oi
— Manish Tewari (@ManishTewari) October 26, 2019
మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి చెందిన వీర్ సావర్కర్, జ్యోతిబాపులేలకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తుందని ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సమాజాన్ని ఉద్ధరించిన మహానీయుల పట్ల కూడా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న వారికి రావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాగా, వీర్ సావర్కర్కు భారతరత్న ఇస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వండంటూ కేంద్రంపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ.