బాధేస్తోంది, సరైన టైంలో సమాధానం చెప్తా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి విశాల్ సిక్కా వైదొలగడానికి ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి విశాల్ సిక్కా వైదొలగడానికి ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇన్ఫీ బైబ్యాక్ కు.. విశాల్ సిక్కా ఎఫెక్ట్? రేపటి బోర్డు సమావేశమే కీలకం!
బాధేస్తోందని మూర్తి లేఖ
ఈ ఆరోపణలపై నారాయణ మూర్తి స్పందించారు. తన పిల్లలకు డబ్బు, హోదా అవసరం లేదని, ఇలాంటి ఆరోపణలు తనను వేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
స్వచ్ఛందంగా వైదొలిగా
ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు విడుదల చేసిన ప్రకటనను చదివానని, తనపై వస్తున్న ఆరోపణలను తనను ఎంతగానో వేధిస్తున్నాయని, తాను 2014లో స్వచ్ఛందంగా ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలిగానని చెప్పారు.
అవసరం లేదు
తనకు డబ్బు అవసరం లేదని, తన పిల్లలకు హోదా కోసం తాను ఆశ పడటం లేదని నారాయణ మూర్తి చెప్పారు. తన వాదన అంతా ఒక్కటేనని, కంపెనీ కార్పొరేట్ పాలనలో లోపాలున్నాయని చెప్పారు. దాని గురించే తాను తరచూ ప్రస్తావిస్తున్నానని చెప్పారు.
సరైన సమయంలో సమాధానం చెప్తా
ఇలాంటి నిరాధార ఆరోపణలకు స్పందించడం అంటే తనను తాను తక్కువ చేసుకోవడమేనని నారాయణ మూర్తి అన్నారు. అయితే వీటన్నింటికీ సరైన సమయంలో సరైన పద్ధతిలో సమాధానం చెబుతానన్నారు.
అప్పటి దాకా సిక్కా ఆ పదవిలో
సిక్కా రాజీనామాతో సీవోవోగా పని చేస్తున్న ప్రవీణ్ రావ్కు తాత్కాలిక సీఈవో, ఎండీగా బాధ్యతలు అప్పగించారు. సిక్కాను వైస్ ఛైర్మన్గా నియమించారు. కొత్త సీఈవోను నియమించేంత వరకూ సిక్కా ఈ పదవిలో కొనసాగనున్నారు.
నారాయణ మూర్తి వల్లేనని
ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో బాధ్యతల నుంచి విశాల్ సిక్కా వైదొలగడానికి కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తే కారణమని ఇన్ఫోసిస్ పేర్కొన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా నారాయణ మూర్తి చేస్తున్న వరుస ఆరోపణలు, ఇటీవల ఆయన రాసిన లేఖ వల్లే విశాల్ సిక్కా రాజీనామా చేసినట్లు పేర్కొంది.
నారాయణ మూర్తికి నో
అయితే, నారాయణ మూర్తికి పూర్వ బాధ్యతలు అప్పగించే ఉద్దేశమేదీ లేదని ఇన్ఫోసిస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సిక్కా రాజీనామాకు గల కారణాలను ఇన్ఫోసిస్ వెల్లడించింది.