మోడీపై దీదీ గుస్సా: ఆపత్కాలంలో కూడా రాజకీయాలేనా..? శివాలెత్తిన ఫైర్ బ్రాండ్
కరోనా వైరస్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ శివాలెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆమె విరుచుకుపడ్డారు. ఆపత్కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని దీదీ మండిపడ్డారు. అంతేకాదు ముందుగా రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ సమయంలో పనిచేసుకుంటూ వెళ్లాలే తప్ప.. అభిప్రాయం పేరుతో పాలిటిక్స్కు తెరతీశారని మండిపడ్డారు. సమాఖ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను బుల్డొజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు.
ఇప్పుడే కాదు గత కొద్ది కాలం నుంచి బీజేపీ-టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కరోనా వైరస్ సందర్భంగా మృతులు.. వలసకూలీల తరలింపుపై కూడా ఇరుపార్టీల మధ్య గొడవ జరిగింది. కరోనా వైరస్ గురించి అధ్యయనం చేసేందుకు బెంగాల్కు కేంద్రం బృందం పంపడంతో కూడా ఇష్యూ జరిగిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న వలసకూలీలను బెంగాల్ ప్రభుత్వం అనుమతించకపోవడం సరికాదని.. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా లేఖ రాశారు. అయితే తాము కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని.. ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేయడం సరికాదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని ఆమె కోరారు. కానీ ప్రతీ దానికి బెంగాల్, బెంగాల్ అని కేంద్ర ప్రభుత్వం అనడం సరికాదని మండిపడ్డారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకుంటే సమస్య సమసిపోతుందని చెప్పారు. మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కూడా మమతా బెనర్జీ కోరారు. రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు.