ఇంకా ప్రధానిగా ప్రమాణం చేయలేదు..! కాని పని మొదలు పెట్టిన మోదీ-షా జోడి..!!
ఢిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మరో ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల మెడపై కత్తి వేలాడుతోంది. మోడీ ప్రమాణ స్వీకారం ముగిశాక ఏ సమయంలోనైనా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఇక్కడ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు నానాతిప్పలు పడుతోంది. అయితే.. ఈ నెల 30న మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏ క్షణానైనా ప్రభుత్వాలు మారే అవకాశం కల్పిస్తోంది.
కర్ణాటక, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్లకు ముప్పు..! పావులు కదుపుతున్న బీజేపి..!!
బీజేపీ దక్షిణాన అడుగు పెడదామని భావించిన ప్రయత్నాలకు గతేడాది కాంగ్రెస్ చెక్ పెట్టగలిగింది. ఏడాది కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారం దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ జట్టు కట్టి కర్ణాటక పీఠమెక్కాయి. తర్వాత అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేసినా.. దాన్ని కాంగ్రెస్ సమర్థంగా తిప్పికొట్టింది. ఐతే 2019సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఎన్నికల్లో దారుణ పరాభవానికి గురైంది. స్వయానా జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ తుమకూర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్గౌడ మాండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో బీజేపీ బలం పుంజుకుంది.
ఆపరేషన్ కమలం షురూ..! బీజేపి నేతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దేశ నేతలు..!!
గత ఎన్నికల్లో కేవలం 17 స్థానాలు మాత్రమే సాధించగా ఈసారి ఆ పార్టీ ఏకంగా 21 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఆపరేషన్ కమలం కు పార్టీ తెర తీసింది. కాంగ్రెస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రమేష్ హోలికేరీతో కలిసి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి లాగేందుకు నిర్ణయించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వారంతా బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమైనప్పటికీ.. బీజేపీ అదిష్ఠానం మాత్రం వేచి చూసే ధోరణి అవలంబించింది. ఈ నెల 30న మోడీ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈలోపే ప్రభుత్వాన్ని పడగొడితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తి ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున వేచిఉండాలని కర్ణాటక బీజేపీ నాయకత్వానికి సూచించింది. ఈ నెల 30న మోడీ ప్రమాణ స్వీకారం అయ్యాక జూన్ 3లోగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సీఎంగా కుమారస్వామి రాజీనామా చేసేందుకు సిద్ధపడినా.. కాంగ్రెస్ నేతలు వారించారు. అయితే.. మరోవైపు ఆపరేషన్ కమలం ద్వారా ప్రభుత్వం ఎలాగూ కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్,కర్ణాటకలపై గురి..! గజగజ వణుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు..!!
ఆపరేషన్ కమలం ఎక్కుపెట్టిన మరో రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ గతేడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 230 స్థానాలు మధ్యప్రదేశ్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. కాంగ్రెస్కు 114 సీట్లు రాగా.. బీజేపీ 109 స్థానాలు సాధించింది. బీఎస్పీ రెండు, ఎస్పీ ఒక స్థానం సాధించాయి. కేవలం ఒకే ఒక సీటు దూరంలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. అయితే.. బీఎస్పీ, ఎస్పీ నుంచి మద్దతు తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా ఆపరేషన్ కమల్ కు బీజేపీ తెరతీసింది. ముందుగా మిత్రపక్షాలను దూరం చేసేందుకు వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కొద్ది రోజుల ముందు మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కొల్పోయిందని, వెంటనే మెజార్టీ నిరూపించుకోవాలని చెప్పడం దుమారం రేపింది. నైతిక విలువలకు కట్టుబడిన బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని లేకున్నా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం మాత్రం మధ్య ప్రదేశ్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.
కకావికలమైన ప్రతిపక్షాలు..! భారత్ మొత్తం కాషాయ మయం..!!
ఇందులో భాగంగా ఇటీవల ఎస్పీ అధినేత ములాయం సింగ్ మీద ఉన్న సీబీఐ కేసుల్లో క్లీన్చిట్ ఇచ్చింది. మాయావతి కూడా మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. తద్వారా తనపై ఉన్న సీబీఐ కేసుల్లో క్లీన్చిట్ తీసుకోవాలనేది ఆమె ఎత్తుగడ. మరోవైపు ఆపరేషన్ కమల్ పేరిట ఐదారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో మిత్రపక్షాల మద్దతు ఉపసంహరించుకోవడంతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు దూరమైతే ఏ క్షణానైనా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కూలిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్పై అక్రమాస్తుల కేసు కత్తి వేలాడుతోంది. ఎన్నికలసమయంలో ఆయన అనుచరుల ఇళ్లల్లో భారీ ఎత్తున నగదును ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు మరిన్ని తిప్పలు తప్పేట్టు కనిపించడం లేదు.