మతం మార్చుకో! లేదంటే నరికేస్తాం: ప్రముఖ రచయిత కేపీకి బెదిరింపులు
ప్రముఖ మలయాళీ రచయిత కేపీ రమనున్నికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారాలని.. లేదంటే కుడి చేయి, ఎడమ కాలు నరికేస్తామని బెదిరిస్తూ ఆయనకు లేఖ వచ్చి
తిరువనంతపురం: ప్రముఖ మలయాళీ రచయిత కేపీ రమనున్నికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారాలని.. లేదంటే కుడి చేయి, ఎడమ కాలు నరికేస్తామని బెదిరిస్తూ ఆయనకు లేఖ వచ్చింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఆరు రోజుల క్రితమే రమనున్నికి ఈ లేఖ వచ్చినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. 'ప్రొఫెసర్ జోసఫ్ లాగే మీ చేయి, కాలు కూడా నరకుతాం.. ఇస్లాం మతంలోకి మారకపోతే అల్లా ఇచ్చే శిక్షలను అమలుచేస్తాం' అని ఆగంతకులు లేఖలో పేర్కొనడం గమనార్హం.
ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు రాశారంటూ.. 2010లో తోడుపుజా న్యూమన్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జోసఫ్ చేయి నరికేశారు. మలప్పురం జిల్లాలోని మంజేరీ అనే ప్రాంతం నుంచి ఈ లేఖను పంపించినట్లు తెలుస్తోంది.
అయితే ఎవరు ఈ పనిచేశారో తనకు తెలియడం లేదని, తనకు ఎవరితో శత్రుత్వం లేదని రమనున్ని తెలిపారు. తొలుత తాను లేఖను పట్టించుకోలేదని.. అయితే సీనియర్ రచయితల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమనున్ని తెలిపారు.
రమనున్ని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కేరళకు చెందిన పలువురు యువకులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ సానుభూతిపరుగులుగా మారుతున్నారన్న విషయం తెలిసిందే. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇలాంటి లేఖలు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.