మోడీ మేజిక్ ఉండదు, నోట్లరద్దు హఠాత్ నిర్ణయం కాదు: ఇంటర్వ్యూలో ప్రధాని, రామాలయం, జీఎస్టీపై ఏమన్నారంటే
న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రజలకు, మహాకూటమికి మధ్యే పోరు అని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ పాలనలో ఏ రంగంలో చూసుకున్న దేశం ప్రగతి పథంలో దూసుకు పోతోందని చెప్పారు. దేశంలోని గ్రామాలన్నింటికి విద్యుత్ సౌకర్యం కల్పించామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ ఉండదని, ప్రజల విశ్వాసం మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రజల విశ్వాసం మరింత దృఢమైందన్నారు. పాకిస్తాన్లోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేశామన్నారు. నాలుగు తరాల పాటు దేశాన్ని నడిపిన వారు రైతులకు ఏమీ చేయలేకపోయారని, తాము ఎన్నో చేస్తున్నామని చెప్పారు.
కేసీఆర్లాగే మోడీ గెలుస్తారు!: తెలంగాణలో చంద్రబాబు-రాహుల్ కూటమిని లాగిన జైట్లీ
కాంగ్రెస్ ముక్త్ భారత్పై ఇలా చెప్పాను
తనపై విమర్శలు చేసే వారికి చాలా కృతజ్ఞతలు అని నరేంద్ర మోడీ అన్నారు. వారసత్వం, అవినీతి కాంగ్రెస్ సంస్కృతి అన్నారు. తాను ఎప్పుడు కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పలేదని, కాంగ్రెస్ సంస్కృతి ముక్త్ భారత్ అని చెప్పానన్నారు. కాంగ్రెస్లో అదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అన్నారు. రాజకీయంగా తనకు ఏమైనా ఫర్వాలేదు కానీ సైనికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు. అందుకే మెరుపు దాడుల తేదీలను రెండుసార్లు మార్చామని, మెరుపు దాడులు విజయవంతమైనా, విఫలమైనా సూర్యోదయానికి ముందే తిరిగి రావాలని కమాండోలకు సూచించానని చెప్పారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఓడాం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నరేంద్ర మోడీ స్పందించారు. మూడు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాలన వల్ల ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఓడామని చెప్పారు. మిజోరాం, తెలంగాణలలో బీజేపీ అధికారంలో లేదని చెప్పారు. అక్కడ గెలుస్తామని తాము చెప్పలేదని అన్నారు. 2018 విజయవంతమైన ఏడాది అన్నారు.
నోట్ల రద్దు: బ్లాక్ మనీ వద్దని ఏడాది ముందే హెచ్చరించాం
నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ.. తాము ఏడాది ముందే హెచ్చరించామని నరేంద్ర మోడీ చెప్పారు. ఎవరి వద్దనైనా నల్లధనం ఉంటే వారు దానిని బయట పెట్టి పెనాల్టీ చెల్లించాలని చెప్పామని గుర్తు చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, నల్ల ధనం ఉంచుకోవద్దని ఏడాది ముందు నుంచే చెబుతున్నామని అభిప్రాయపడ్డారు. గతంలో నల్లధనం గురించి అనేక వార్తలు వచ్చేవని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను నల్లధనం కుంగదీసిందన్నారు. అందుకే పెద్ద నోట్లను రద్దు చేశామన్నారు. అలాగే, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తానని ఉర్జీత్ పటేల్ చెప్పారని అన్నారు. అతని రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు.
అందుకే దొంగలు దేశం వదిలి పారిపోతున్నారు
న్యాయ ప్రక్రియ పూర్తయ్యాకే రామ మందిరంపై ఆర్డినెన్స్ ఉంటుందని నరేంద్ర మోడీ చెప్పారు. గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉండి ఉంటే అవినీతి, అక్రమాలు అలాగే ఉండేవని చెప్పారు. అవినీతి లేనందునే దొంగలు దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారని చెప్పారు. దేశం వదిలి పారిపోయిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
మాకు ఎవరి పైనా వ్యక్తిగత కక్ష లేదు
తమకు ఎవరి పైన కూడా వ్యక్తిగత కక్ష లేదని నరేంద్ర మోడీ చెప్పారు. అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. రాహుల్ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనడం ఆయన ఆలోచన విధానమని చెప్పారు. అన్ని పార్టీల అంగీకారంతోనే దేశంలో జీఎస్టీ ట్యాక్స్ అమలులోకి వచ్చిందని చెప్పారు. జీఎస్టీ కౌన్సెల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ వారి సీఎంలను తప్పు పడుతోందా అన్నారు. జీఎస్టీకి ముందు 30 శాతం, 40 శాతం పన్నులు ఉండేవన్నారు. జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమేనని మోడీ అంగీకరించారు. ఇంత పెద్ద ట్యాక్స్ అమల్లోకి తెచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. జీఎస్టీని మరింత సరళీకరిస్తున్నామని చెప్పారు. మధ్యతరగతి ప్రజలు ఎవరి దయాదాక్షిణ్యాల పైన ఆధారపడరని చెప్పారు. గతంలో 18 శాతం ఉన్న ద్రవ్యోల్భణాన్ని 3 శాతానికి తగ్గించామని చెప్పారు. ధరలను తగ్గించింది తమ ప్రభుత్వమే అన్నారు. మధ్య తరగతి కోసం ఉడాన్ తెచ్చామన్నారు.