విపక్షాల ఫైర్: 'ఓం అని పఠించడం తప్పేమీ కాదు'
ఛండీగడ్: జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవం రోజున 'ఓం', ఇతర వేద మంత్రాలను పఠించే విషయంలో రాజకీయ వర్గాల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ భార్య సల్మా అన్సారీ మాట్లాడారు.
'ఓం' అని పఠించడం తప్పేమీ కాదని ఆమె మీడియాతో చెప్పారు. అల్లా అనీ, గాడ్ అని మనం అంటుంటామని, ఓం కూడా అలాంటిదేనని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కూడా ఆమె సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరూ 'ఓం'ను పఠించాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ముస్లింలు 'ఓం' పఠనం చేయకూదని అది ఇస్లాంకు వ్యతిరేకమని అప్పట్లో పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొందరు ముస్లిం మత పెద్దలు యోగాను వ్యతిరేకించాలని కూడా వ్యాఖ్యానించారు.
దీనిపై సల్మా మాట్లాడుతూ యోగాను వ్యతిరేకించడం పూర్తిగా తప్పని, తాను యోగా చేయకుండా ఉండి ఉంటే కొన్ని ఎముకలు ఇప్పటికే దెబ్బతిని ఉండేవని చెప్పారు. తాజాగా జూన్ 21న యోగా దినోత్సవంలో ప్రజలంతా పాల్గొని యోగా చేయడానికి ముందు ఓంతో పాటు వేదమంత్రాలను పఠించాలని కేంద్రం కోరడంతో విపక్షాల అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ఈ చర్యను హిందుత్వ ఎజెండాను బలవంతంగా రుద్దే ప్రయత్నంగా విపక్షాలు ఆరోపించాయి. దీంతో దీనిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. యోగా సమయంలో ఓంతో పాటు వైదిక మంత్రాలను ఉచ్ఛరించడం ఐచ్ఛికమని, ఇష్టపడని వారు మౌనంగా యోగా చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆయూష్ శాఖ ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఢిల్లీకి బదులుగా ఛండీగఢ్లో నిర్వహించనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దేశంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, పాఠశాల్లో తప్పనిసరిగా యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలని యూజీసీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.