సాగుచట్టాలు సరైనవే- రైతు నిరసనలే తప్పు- పార్లమెంటులో కేంద్రం ఎదురుదాడి
గతంలో తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర నిరనసలు వ్యక్తమవుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని మరోసారి సమర్ధించుకుంది. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న నిరసనలపై స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ చట్టాల్లో తప్పేమీ లేదని, రైతుల నిరసనలే తప్పు అంటూ వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో రైతు నిరనసలపై జరుగుతున్న చర్చలో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. వ్యవసాయ చట్టాలను పూర్తిగా సమర్ధించుకున్నారు. ఢిల్లీలోని గాజీపూర్ సరిహద్దుల్లో రైతులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విపక్షాలు సభను అడ్డుకుంటున్న సమయంలోనే దీనిపై మాట్లాడిన తోమర్.. రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్లో తప్పేమీ లేదని, నిరసనలు చేస్తున్న రైతులదే తప్పంటూ ఎదురుదాడికి దిగారు.
వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలంటూ రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన తోమర్.. ఇందులో నల్లదేంటే చెప్పాలంటూ వారిని ప్రశ్నించారు. అదేంటో చెప్తే తాము సరిచేసుకుంటామన్నారు. రైతులకు వారి ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా కనీస మద్దతు ధర ఇస్తున్నామని, ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేశామని తోమర్ చెప్పుకొచ్చారు. కానీ కొందరు రైతులను వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే తమ పొలాలు లాక్కొంటారని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంతో పాటు జీడీపీలో వ్యవసాయ ఆదాయం పెంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. రైతు సంక్షేమానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని తోమర్ తెలిపారు.