సీఎం కావాలని ఆశ ఉంది, సిద్దూ మాటల్లో తప్పు లేదు, ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో కలకలం !
బెంగళూరు: మంత్రి హెచ్.డి. రేవణ్ణ కూడా సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సిద్దరామయ్య మాటల్లో ఎలాంటి తప్పు లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. ఉపమేశ్వర్ అన్నారు.
గురువారం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మంత్రి హెచ్.డి. రేవణ్ణ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది అంటూ సిద్దరామయ్య ట్వీట్ చేశారని, అందులో తనకు ఎలాంటి తప్పు కనపడటం లేదని అన్నారు. సీఎం అయ్యే అర్హత చాలమందికి ఉందని డాక్టర్ జీ. పరమేశ్వర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తనతో పాటు చాల మంది ముఖ్యమంత్రి కావాలి అని ఆశ పడుతున్నారని డాక్టర్ జీ. పరమేశ్వర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ ఇటీవల మాట్లాడుతూ తాను ఏమీ సన్యాసి కాదని, ముఖ్యమంత్రి కావాలని తనకు ఆశ ఉందని చెప్పిన విషయం తెలిసిందే.
మంత్రి డీకే. శివకుమార్ తో పాటు అనేక మందికి ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉందని, వారి కోరికలో ఎలాంటి తప్పులేదని డాక్టర్ జీ. పరమేశ్వర్ సమర్థించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇలాంటి చర్చలు జరుగుతాయని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు,
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కులబురిగి జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లికార్జున్ ఖార్గే ఎప్పుడో సీఎం కావలసి ఉందని, అయితే అది సాధ్యం కాలేదని చెప్పిన విషయాన్ని ఇదే సమయంలో డాక్టర్ జీ. పరమేశ్వర్ గుర్తు చేశారు. మొత్తం మీద సీఎం కుర్చి కోసం సంకీర్ణ ప్రభుత్వంలో చాల మంది పోటీ పడుతున్నారని మరోసారి వెలుగు చూసింది.