Lockdown: వందేళ్ల క్రితమే బెంగళూరులో లాక్ డౌన్, 1918లో Influenza: నేడు కరోనా, సేమ్ సీన్ !
బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్, సీల్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ కాటు నుంచి ప్రజలను కాపాడటానికి మార్చి 25వ తేదీ నుంచి భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేశారు. ప్రస్తుతం కొన్ని సడలింపులతో దేశంలో లాక్ డౌన్ 5.0 అమలులో ఉంది. ప్రస్తుత దేశ ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో దాదాపు వంద సంవత్సరాల క్రితమే (1918) లాక్ డౌన్ అమలు చేశారు. బెంగళూరులో ఎందుకు లాక్ డౌన్ చేశారు ? లాక్ డౌన్ కు కారణం అయిన మహమ్మారి Influenza వ్యాధి ఏమిటి ? ఆ వ్యాధి నుంచి బెంగళూరు ప్రజలు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనే పూర్తి సమాచారంతో పాటు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు వన్ ఇండియా సేకరించింది.
Recommended Video
Lockdown: రేయ్ నరికేస్తా, తలకాయలు లేచిపోతాయ్, విక్రమార్కుడు: వీడియో వైరల్, ఏం జరిగిదంటే ?
సీల్ డౌన్, లాక్ డౌన్, క్వారంటైన్
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రస్తుతం ప్రజలు క్వారంటైన్, సీల్ డౌన్, లాక్ డౌన్, ఐసోలేషన్ అనే పదాలు వింటూ మానసికంగా కుంగిపోతున్న ప్రజలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. అయితే లాక్ డౌన్, సీల్ డౌన్ అనే పేర్లు ఐటీ బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు ప్రజలకు కొత్తకాదని, వందేళ్ల క్రితమే ఆ పదాలు వారికి తెలుసని వెలుగు చూసింది.
100 ఏళ్ల క్రితం బెంగళూరులో !
వందేళ్ల క్రితమే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బెంగళూరులో కరోనా వైరస్ లాంటి లక్షణాలు ఉన్న భయంకరమైన ఇన్ ఫ్లూయెంజా అనే వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేసింది. మొదటిసారి ఇన్ ఫ్లూయెంజా అనే వ్యాధి 1918లో బెంగళూరులో వెలుగు చూసింది. తరువాత మళ్లీ 10 ఏళ్ల తరువాత 1928లో అదే వ్యాధి బెంగళూరు ప్రజలకు నిద్రలేకుండా చేసింది. అప్పటి బెంగళూరు సిటీ మునిసిపల్ కౌన్సిల్ జారీ చేసిన నోటీసు ఒన్ ఇండియా మీడియా చేతికి చిక్కింది.
1928లో బ్రిటీష్ ప్రభుత్వం హెల్త్ నోటీసు
బెంగళూరులో మొదటిసారి 1918లో ఇన్ ఫ్లూయెంజా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆ సమయంలో జ్వరం, దగ్గు, తుమ్ములతో ఆ వ్యాధి వ్యాపిస్తోందని అప్పటి బెంగళూరు మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ అదే వ్యాధి 1928లో బెంగళూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడంతో అప్పటి బెంగళూరు సిటీ మునిసిపల్ కౌన్సిల్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ నోటీసులు జారీ చేసింది.
100 ఏళ్ల క్రితమే సినిమాలు, నాటకాలు బంద్
1918 నుంచి 1928 మద్యకాలంలో బెంగళూరు ప్రజలు దగ్గు, జ్వరం, జలుబు వ్యాధులతో నరకం చూశారని వెలుగు చూసింది. ఆ సమయంలో చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు న్యూమోనియా వ్యాధితో బాధపడ్డారని అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఆరోగ్యం కాపాడుకోవాలని, ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించి జాగ్రత్తగా ఉండాలని అప్పటి ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల్లో సూచించింది. ఇన్ ఫ్లూయెంజా అంటువ్యాధి వ్యాపించకుండా ఉండటానికి అప్పట్లోనే సినిమా, నాటక ప్రదర్శనలు, బహిరంగ చర్చలు, సమావేశాలను అప్పటి బెంగళూరు మునిసిపల్ కౌన్సిల్ పూర్తిగా నిషేధించింది.
1928లో లాక్ డౌన్ రూల్స్ ఇవే
1918లో, 1928లో బెంగళూరులో లాక్ డౌన్ అమలు చేశారు. అప్పటి లాక్ డౌన్ నియమాలు ఇలా ఉన్నాయి.
*. ప్రజలు గుంపులు గుంపులుగా ఒక్కచోట చేరకూడదు, దగ్గు, జలుబు ఉన్న వారు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు.
*. సినిమాలు, నాటకాల ప్రదర్శనలకు వెళ్లకూడదు. అలా చేస్తే అంటువ్యాధి వ్యాపించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు ప్రజలను హెచ్చరించారు.
*. ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ బహిరంగంగా మలమూత్ర విసర్జన చెయ్యడం నిషేధమని బెంగళూరు మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.
*. శరీరానికి, మనసుకు అలసట ఎక్కువ అయ్యే పనులు చెయ్యకూడదని, ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అప్పటి బెంగళూరు మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
1928 మార్చి 11వ తేదీన బెంగళూరు సిటీ మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య శాఖ ఇన్ చార్జ్ డాక్టర్ జీవీ, మాస్కర్న్ హార్స్ (బ్రిటీష్ ప్రభుత్వ అధికారి) బెంగళూరు ప్రజలకు పై విధంగా సూచిస్తూ జారీ చేసిన నోటీసు పత్రాలు వన్ ఇండియా సేకరించింది.
మహమ్మారి రోగం వస్తే ఏం చెయ్యాలి ?
అప్పటి బెంగళూరు ప్రజలకు ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం అనేక సూచనలు చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇన్ ఫ్లూయెంజా వ్యాధి వస్తే వెంటనే ఇంట్లో నేల మీద చాపలు పరుచుకుని పడుకోవాలని, ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా తీసి వేసి స్వచ్చమైన గాలి వచ్చేలాగా చూసుకోవాలని, లేదా బహిరంగ ప్రదేశాల్లో స్వచ్చమైన గాలి వచ్చే ప్రాంతాల్లో ఉండాలని, అలా చేస్తే వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉందని అప్పటి బెంగళూరు సిటీ మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స
ఇన్ ఫ్లూయెంజా వ్యాధి వ్యాపించిన వెంటనే మలమూత్రం సక్రమంగా వెళ్లడానికి ఇబ్బంది ఎదురైతే ప్రతి ఒక్కరు బేధి ఉప్పు ( Epsom Salt) ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మహమ్మారి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి అక్కడి వైద్యుల దగ్గర చికిత్స చేయించుకోవాలని బెంగళూరు మునిసిపల్ కౌన్సిల్ అధికారులు సూచించారు. అప్పట్లో నాటు వైద్యం తప్పా ఎక్కడా ప్రైవేటు ఆసుపత్రులు లేవు.
ఆనాటి, ఇప్పటి ఔషదాలు (మందులు) ఒక్కటే
ఆసుపత్రిలో చికిత్స అందుబాటులో లేకపోతే ఆ వ్యాధి నుంచి బయటపడటానికి C.A.Q అనే ఔషదం ( Cin Ammoniated Quinine) తీసుకోవాలని అప్పటి బెంగళూరు మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. అప్పటి వైద్య శాఖ అధికారులు సూచించిన సలహాలు, సూచనలతో బెంగళూరు ప్రజలు మహమ్మారి ఇన్ ఫ్లూయెంజా వ్యాధి నుంచి బయటపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం H.C.Q మాత్రలే 1918లో ఇన్ ఫ్లూయెంజా వ్యాధి నుంచి ప్రజలను కాపాడటానికి C.A.Q మాత్రలు ఉపయోగించారు. అప్పుడు ఇప్పుడు ఉపయోగిస్తున్న మాత్రలు రెండు ఒకే ఔషదం నుంచి తయారు చేశారని రికార్డులు చెబుతున్నాయి.