17 రోజుల సమయమిచ్చినా శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు: బీజేపీ అడ్వకేట్ ముకుల్ రోహత్గి
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, శివసేన తరపున కపిల్ సిబాల్, అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపించగా.. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గి కూడా ధీటుగా వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన కూటమికి గవర్నర్ నోటీసు ఇచ్చారని తెలిపారు. దాదాపు 17 రోజుల సమయం కూడా ఇచ్చారని చెప్పారు. శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతోనే గవర్నర్ విచక్షణాధికారం ఉపయోగించారని తెలిపారు. దీనిని న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. కానీ ప్రజలకు ప్రభుత్వం కావాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పేమీ కాదు కదా అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అంతేకాదు శనివారం నాటి గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతిని ప్రశ్నించే అధికారం లేదని గుర్తుచేశారు.
ఇవాళ ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు. కానీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సీరియస్నెస్ దృష్ట్యా నేపథ్యంలో పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.
సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ శివసేన, ఎన్సీపీ తరపున తమ వాదనలను వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ అడ్వకేట్ దేవదత్త్ కామట్ వాదనలు కొనసాగించారు. మహారాష్ట్ర గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తమ వాదనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి బీజేపీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తురు.