మహిళల దర్శనంతో శబరిమల సంప్రోక్షణ..! కోర్టుకెక్కిన బిందు.. పూజారికి నోటీసులు
Recommended Video
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళలు వెళ్లొచ్చనే సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లడం పెద్ద దుమారమే రేపింది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఆ మధ్య 51 మంది అయ్యప్పను దర్శించుకున్నట్లు వెల్లడించింది. తాజాగా అసెంబ్లీలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ప్రకటించింది. ఈ భిన్న ప్రకటనల నేపథ్యంలో.. పూజారికి ట్రావెన్కోర్ బోర్డు నోటీసులివ్వడం చర్చానీయాంశంగా మారింది.
సంప్రోక్షణ వివాదం..!
శబరిమల ఆలయంలోకి బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ప్రవేశించడం దుమారం రేపింది. వారిద్దరు పోలీస్ ఎస్కార్ట్తో తెల్లవారుజామున ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ మేరకు కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా ధృవీకరించారు. పోలీసుల సహాయంతో ఈ మహిళలిద్దరు స్వామిని దర్శించుకున్నట్లు ప్రకటించారు. బిందు, కనకదుర్గ ఆలయ సన్నిధిలోకి ప్రవేశించిన కొద్దిగంటల్లోనే టెంపుల్ మూసివేస్తూ ప్రధాన పూజారి సంప్రోక్షణకు ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతోనే తాము ఆలయంలోకి ప్రవేశించామని చెబుతున్న బిందు.. సంప్రోక్షణపై గళమెత్తారు. ప్రధాన పూజారి తీసుకున్న నిర్ణయం.. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కేరళ సీఎంతో పాటు శబరిమల ఆలయానికి సంబంధించిన ట్రావెన్కోర్ బోర్డు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన పూజారికి నోటీసులు జారీ చేసింది దేవస్థానం బోర్డు.
యూటర్న్: 51 మంది కాదు..ఇద్దరేనట
ఆ రోజు శుద్ధి ఎందుకంటే..!
ఆ రోజు జరిగిన సంప్రోక్షణపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రావెన్కోర్ బోర్డు ఒకలా చెబుతుంటే.. ఆలయ ప్రధాన పూజారి మరోలా చెబుతున్నారు. తమ అనుమతి లేకుండా పూజారి నిర్ణయం తీసుకున్నారనేది బోర్డు సభ్యుల వాదన. సంప్రోక్షణ చేస్తున్నట్లు ఫోన్ ద్వారా తెలిపారే గానీ, తాము స్పందించకముందే ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారని చెబుతున్నారు. అదలావుంటే ఆలయ పరిశుభ్రత కోసమే ఆ రోజు సంప్రోక్షణ చేశామంటున్నారు. రెండు రోజులకు ఒక్కసారి ఆలయ శుద్ది చేస్తుంటామని.. అందులోభాగంగానే ఆరోజు కూడా సంప్రోక్షణ చేశామనేది ఆయన వెర్షన్.
దశాబ్ధాల నిబంధనలకు బ్రేక్
శబరిమల ఆలయంలోకి మహిళలు రాకూడదనే నిబంధన దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదస్పదంగా మారింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తూ సెప్టెంబర్ 28న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. మతాచారాల పేరిట మహిళలపై వివక్ష చూపించడం తగదని.. అది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నమని పేర్కొంది. అంతేకాదు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. దీంతో అయ్యప్ప భక్తులతో పాటు హిందు సంఘాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాయి.