శిక్ష పడినా.. ఆలస్యం వల్లే ఎంపీగా, ఎమ్మెల్యేగా: ఈసీ
న్యూఢిల్లీ: శిక్ష పడిన ప్రజా ప్రతినిధుల అనర్హతను ఎలాంటి వివక్షకు తావు లేకుండా వెంటనే నోటిపై చేయాలని ఎన్నికల కమిషన్(ఈసీ) పార్లమెంట్, శాసనసభలకు స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో ఆలస్యం జరగడం వల్ల ప్రజా ప్రతినిధులు చట్ట వ్యతిరేకంగా ఎంపీ, లేదా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలు కలుగుతోందని ఎన్నికల కమిషన్ అభిప్రాయ పడింది.
అంతేకాదు శిక్షలకు సంబంధించిన సమాచారం, తదుపరి అనర్హతకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడానికి ఒక్కోదానికి ఏడు రోజులు మించకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఆలస్యం జరగడం వల్ల అనర్హతకు గురైన ప్రజా ప్రతినిధులు రాజ్యాంగంలోని 103వ అధికరణకు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా సంబంధిత చట్టసభలో సభ్యుడుగా కొనసాగడానికి దారి తీస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలు తమకు విధించిన శిక్షలను సవాలు చేస్తూ దాఖలు చేసుకున్న పిటిషన్ పైకోర్టులో పెండింగ్లో ఉన్నంత కాలం అనర్హత నుంచి తప్పించుకోవడానికి వీలు కల్పించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 సబ్ సెక్షన్ 4న 2013 జూలై 10న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు తీర్పే సర్వోన్నతమైనది కాబట్టి అవినీతికి సంబంధించిన కేసులతో సహా కొన్ని కేసుల్లో శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు తక్షణం ఏ చట్టసభలోనూ సభ్యుడుగా కొనసాగడానికి వీల్లేకుండా పోతోంది. ఒక ప్రజా ప్రతినిధికి విధించిన శిక్షను లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి... ఆ సభ్యుడు దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంటే దాని సెక్రటేరియట్కు తక్షణం తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది.
సుప్రీం తీర్పు తర్వాత పార్లమెంట్ నుంచి తొలిసారిగా అనర్హతకు గురైంది కాంగ్రెస్ రాజ్ససభ సభ్యుడు రషీద్ మసూద్. అవినీతి, ఇతర నేరాల్లో న్యాయస్థానం ఆయనను దోషిగా ప్రకటించడంతో 2013 అక్టోబర్ 13న ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. అలాగే దాణా కుంభకోణం కేసులో శిక్షలు పడిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, జెడి(యు) నేత జగదీశ్ శర్మలను 2013 అక్టోబర్ 22న లోక్సభ సభ్యులుగా అనర్హులుగా ప్రకటించిన వారిలో ఉన్నారు.