ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: ఇకపై ఈఎల్స్ తప్పనిసరిగా వాడుకోవాల్సిందే
ఎన్నికల వేళ పీఎఫ్పై వడ్డీ పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఉద్యోగస్తులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. సాధారణంగా ఉద్యోగులకు లభించే ఆర్జిత సెలవులు (ఎర్నెడ్ లీవ్స్ )కు సంబంధించి కనీసం 20 సెలవులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ఎర్నెడ్ లీవ్స్ వినియోగించుకోకపోతే రిటైర్ మెంట్ సమయంలో దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేవారు.
ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు
ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఉద్యోగులను 10 రోజుల పాటు ఆర్జిత సెలవులపై పంపించడం జరిగింది.గతేడాది అక్టోబరులో బ్యాంకు యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకురావడంతో అందులో పనిచేసే ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా 20 రోజుల ఆర్జిత సెలవు వినియోగించుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. దీని వల్ల పనిఒత్తిడి నుంచి ఎంప్లాయిస్కు కాస్త ఉపశమనం లభిస్తుందని తద్వారా వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం ఉద్యోగులకు ఏటా 30 ఆర్జిత సెలవులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని సెలవులకు సంబంధించి వేతనం చెల్లిస్తారు. ప్రతి ఏడాది 30 పెయిడ్ లీవ్స్ వారికి లభిస్తాయి. అదే రక్షణ రంగంలో పనిచేసే ఉద్యోగులకు 60 రోజుల పెయిడ్ లీవ్ ఉంటాయి. ఇది తమకు లభించే 10 క్యాజువల్ లీవ్స్, 19 ప్రభుత్వ సెలవులకు అదనం. సాధారణంగా చాలా మంది ఉద్యోగులు తమ ఎర్నెడ్ లీవ్స్కు మరిన్ని రెండు సెలవులు జోడించి ఒక సుదీర్ఘ వారాంత సెలవులు తీసుకుంటారు. అయితే 300 రోజుల్లోగా వినియోగించుకోని ఆర్జిత సెలవులను రిటైర్మెంట్ సమయంలో దానికి రావాల్సిన డబ్బులను చెల్లించడం జరుగుతుంది. అందుకే వీటిని వాడకుండా అలానే ఉంచుకుంటారు.
10 ఆర్జిత సెలవులకంటే ఎక్కువగా మిగిలించరాదు
ఆర్జిత సెలవులు వినియోగించుకోకుండా పదవీవిరమణ సమయంలో ఎన్క్యాష్ చేసుకోకుండా ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అందుకు త్వరలో సర్క్యులర్ కూడా జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఒక క్యాలెండర్ సంవత్సరానికి ఒక ఉద్యోగి 10 కంటే ఎక్కువగా ఆర్జిత సెలవులు మిగిల్చుకోవడానికి వీల్లేదు. ఇక 2019 ఆర్థిక సంవత్సరానికి గాను అలవెన్సులు చెల్లించేందుకు గాను 35 మిలియన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ. 632.49 బిలియన్లు కేటాయించింది. ఇందులో అధిక భాగం ఆర్జిత సెలవులకే వెళుతోంది. 2018 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ కంటే ఈ సారి 10 శాతం ఎక్కువగా కేటాయించింది కేంద్రం.