28 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: అన్నాడీఎంకేలో మూడో గ్రూప్, తలపట్టుకున్న సీఎం!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని అర్థం కాకపోవడంతో ఆ రాష్ట్ర ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ లోని నాయకులు ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయారు.
ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మరో చిక్కు ఎదురైయ్యింది. ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన కొందరు ఎమ్మెల్యేలు ఓ గ్రూపుగా తయారై కొత్త డిమాండ్లు తెరమీదకు తీసుకు వస్తున్నారని తెలుసుకున్న సీఎం ఎడప్పాడి పళనిసామి వర్గం ఆందోళన చెందుతోంది.
సీఎంకే సినిమా చూపిస్తున్నారు
శశికళ నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో బహిరంగంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీలో చీలిక తీసుకు వచ్చారు. ఆయన వెంట ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
రాజీకి నిచ్చెన వేస్తే
అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు రాజీ కావాలని నిచ్చేన వేశారు. అయితే రెండు వర్గాల నాయకుల పరస్పర ఆరోపణల ఫలితంగా ఆ నిచ్చెన కాస్త కిందకు దిగింది. మరోసారి రాజీ కావడానికి ఇరు వర్గాలు ఏకం అవుతున్న సమయంలో మరో సమస్య వచ్చిపడింది.
గురువారం మంచిరోజు
అన్నాడీఎంకే పార్టీలోని 28 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మంతనాలు జరిపారు. గుట్టుచప్పుడు కాకుండా గురువారం 28 మంది ఎమ్మెల్యేలు చెన్నైలో సమావేశం కావాలని బుధవారం రాత్రి నిర్ణయించారని తాజాగా వెలుగు చూడటంతో ఎడప్పాడి పళనిసామి వర్గం హడలిపోయింది.
ఆ నాయకుడు ఎవరూ ?
28 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసి సమావేశం నిర్వహించడానికి సిద్దం అయిన ఆ నాయకుడు ఎవరూ ? అంటూ పళనిసామి వర్గం ఆరా తీస్తోంది. 28 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గం వైపు మొగ్గు చూపితే మరిన్ని కష్టాలు ఎదురౌతాయని పళనిసామి వర్గం ఆందోళన చెందుతోంది.
ప్రభుత్వం ఏదైనా సరే మాకు ఓకే
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల్లో అధికారం ఎవ్వరికి వచ్చినా సరే మాకు మా డిమాండ్లు తీర్చాలని 28 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. అన్నాడీఎంకే కొత్త ప్రభుత్వం ఏర్పడితే కచ్చితంగా మా గ్రూప్ లోని వారికి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలని 28 మంది ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు.
మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పనేనా
అన్నాడీఎంకే పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలో చోటు దక్కని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ఈ 28 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నారా ? ఆయనే వీరిని రెచ్చగొడుతున్నారా ? అంటూ పళనిసామి వర్గం ఆరా తీస్తోంది.
ధిక్కార స్వరం వినిపించారు
పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు విలీనం అయ్యి ఎవరికి ఏ పదవులు పంచుకోవాలో అనే నిర్ణయం వారికివారే తీసుకుంటే ఇక ఎమ్మెల్యేలు అయిన మేము ఏం చెయ్యాలి ? మాతో వారికి ఏంపని ? మా అభిప్రాయాలు తెలుసునే అవసరం వారికిలేదా ? అంటూ రెండు రోజుల క్రితం సెంథిల్ బాలాజీ మీడియా ముందు ధిక్కార స్వరం వినిపించారు.
మాజీ మంత్రి బాటలో ?
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడిన తరువాత ఇప్పుడు 28 మంది ఎమ్మెల్యేలు మూడో గ్రూపుగా తయారై అన్నాడీఎంకే పార్టీకి కొత్త తలనొప్పి తీసుకువస్తున్నారని వెలుగు చూసింది. ఆరోజే సెంథిల్ బాలాజీ బాటలో మరి కొందరు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి.
రంగంలోకి పన్నీర్ సెల్వం టీం
28 మంది ఎమ్మెల్యేలను దగ్గరకు తీసుకుని పళనిసామి వర్గాన్ని మరింత ఇబ్బంది పెట్టడానికి పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే పన్నీర్ వర్గం తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నది తెలిసింది.