జమ్మూకాశ్మీర్లో ఇక ఎవరైనా భూములు కొనుగోలు చేయొచ్చు: కేంద్రం, ఒమర్, ముఫ్తీ స్పందన
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్, లడఖ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడైనా జమ్మూకాశ్మీర్, లడఖ్లలో భూములు కొనుగోలు చేయడానికి అవకాశం కాల్పించింది. అక్కడ భూములు కొనుగోలు చేసే విధానంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా భూములు కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో నివాసం ఉండే అవకాశాన్ని కూడా భారతదేశంలోని పౌరులందరికీ కల్పించింది.
అయితే, వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయింపును ఇచ్చింది. విద్య, వైద్యాలయాలకు సంబంధించి మాత్రం ఈ భూములు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ పునర్వవ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించింది. పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అవసరమని లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
2015, ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో భారతదేశంలో విలీనం చేసింది. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
ఇది ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను జమ్మూకాశ్మీర్కు చెందని రాజకీయ నేతలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు నష్టం కలిగించేదిగా ఉందని వ్యాఖ్యానించారు.