భూతల స్వర్గంలో ఇక ఎవరైనా భూములు కొనొచ్చుగా! మౌలికరంగం పరుగులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఉన్న రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నట్టుగా భావిస్తోన్న జమ్మూ కాశ్మీర్ ఇక నిజంగానే భూతల స్వర్గంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, జమ్మూ కాశ్మీర్ ను విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం వల్ల ఇక అక్కడ స్వేచ్ఛగా ఎవ్వరైనా భూములు కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి పరిపాలనాపరమైన అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా జీవించ వచ్చు. ఎలాంటి ఆంక్షలు లేని వాతావరణంలో జీవనాన్ని కొనసాగించడానికి వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు.
ఇతర రాష్ట్రాల వాళ్లు జమ్మూ కాశ్మీర్ లో భూములు కొనడానికి అనర్హులు..
ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందుతూ వచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదనే అభిప్రాయం చాలామందిలో ఉండేది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక జెండా సైతం ఉంది. భారత రాజ్యంగం పరిధిలోకి రాని విధంగా ఆర్టికల్ 370ని రూపొందించారు. దేశం మొత్తం మీద అయిదేళ్లకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఆరేళ్లకోసారి జరిగేవి. కాశ్మీరేతరులు భూములు కొనే వీలు ఉండేది కాదు. పొరుగు రాష్ట్రాల ప్రజలు కేవలం అతిథులుగా మాత్రమే జమ్మూ కాశ్మీర్ లో నివసించే వాళ్లు. వారికి సొంత చిరునామా కూడా దొరకదు. కాశ్మీరీ పండిట్లు సైతం భూములు కొనాలంటే ఆంక్షలను ఎదుర్కోవాల్సిన దుస్థితిని కల్పించింది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ లో జన్మించిన వారే అక్కడ భూములను కొనుగోలు చేసే హక్కు ఉంది. కాశ్మీరేతరులకు ఎంత మాత్రమూ ఆ అవకాశం ఉండేది కాదు. అదే సమయంలో- కాశ్మీరీ మహిళలు స్వరాష్ట్రానికి చెందిన వారిని కాకుండా.. రాష్ట్రేతరులను వివాహం చేసుకుంటే.. ఆ మహిళకు కూడా తన సొంత రాష్ట్రంలో ఆస్తిని కొనుగోలు చేసే హక్కు ఉండేది కాదు. వారి పిల్లలకు కూడా అదే వర్తించేది.
ఇక స్వేచ్ఛగా..
ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రానికి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇక నుంచి నిర్బంధ పరిస్థితులు తలెత్తవు. ఇక ఎవ్వరైనా జమ్మూ కాశ్మీర్ లో భూములు కొనుగోలు చేయవచ్చు. స్వేచ్ఛగా నివసించవచ్చు. భూముల కొనుగోళ్లు, క్రయ విక్రయాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. ఫలితంగా- ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. ఉగ్రవాదం అనేది తగ్గుముఖం పడుతుంది. కాశ్మీరీల రోజువారీ కార్యకలాపాల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వారి జీవితాలు మెరుగు పడతాయి. ఎవ్వరైనా భూములను కొనుగోలు చేసే అవకాశం లభించడం వల్ల బహుళ జాతి సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఇక మౌలిక రంగం పరుగులు..
జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఇక అక్కడ మౌలిక వసతుల కల్పన రంగం పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బహుళజాతి సంస్థలు భారీగా స్థలాలను కొనుగోలు చేసి, హోటళ్లు, అపార్ట్ మెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీ ప్లెక్సులను కట్టడానికి అవకాశం దొరికినట్టయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు భారీ ఎత్తున చోటు చేసుకోవడానికి కేంద్రం బాటలు వేసినట్టయింది. భూతల స్వర్గంగా పేరున్న జమ్మూ కాశ్మీర్ కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టవుతుంది. ప్రత్యేకించి- స్టార్ హోటళ్లు నెలకొల్పడానికి పెట్టుబడిదారులకు అవకాశం ఏర్పడింది. ఫలితంగా- ఉగ్రవాదం క్రమంగా మాయం కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.