రైల్వే ప్రయాణికులకు శుభవార్త! భీమ్, యూపీఐ యాప్ల ద్వారా టిక్కెట్ల బుకింగ్..
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ బుకింగ్ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్ల ద్వారా టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ బుకింగ్ను మరింత సరళతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ మేరకు చర్యలు చేపట్టింది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట కలగనుంది.
దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచే యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేయనున్నట్టు ఇండియన్ రైల్వే గురువారం ప్రకటించింది. ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదని రైల్వే బోర్డు సభ్యుడు మొహమ్మద్ జంషెడ్ తెలిపారు.
మొబైల్ లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని, దీనికోసం అవసరమైన క్యూఆర్ కోడ్ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. యూపీఐ చెల్లింపుల కోసం దేశవ్యాప్తంగా 14 వేల కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల రైల్వే టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతున్నాయని, కేవలం మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయని జంషెడ్ వివరించారు.