డేటా దుర్వినియోగం ఎలా?: ఫేస్బుక్పై కేంద్రం ప్రశ్నల నోటీసు, నిలదీత
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే ఈ వివాదంలో కేంద్ర బిందువైన బ్రిటన్కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు తాఖీదులు ఇచ్చింది.
తాజాగా డేటా లీక్ వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా ఫేస్బుక్కు కేంద్ర ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 7లోపు దీనికి స్పందించాల్సిందిగా ఆదేశించింది.
భారతీయుల సమాచారం ఎలా వెళ్లింది?
‘ఫేస్బుక్లో ఉన్న భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ లేదా ఇతరుల వద్ద ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే అది వారి దగ్గరకు ఎలా వెళ్లింది?' అని కేంద్రం ఫేస్బుక్ యాజమాన్యాన్ని నిలదీసింది.
అసలేంటీ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా'? ఏం చేసింది?: డేటా చౌర్యం, ఎఫ్బీ సారీ
డేటాను ఉపయోగించుకున్నాయా?
అంతేగాక, ‘భారతీయ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఫేస్బుక్ కానీ లేదా ఇటువంటి ఏజెన్సీలు ఏవైనా మీ దగ్గర ఉన్న డేటాను గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపయోగించుకున్నాయా'? అనే పలు ప్రశ్నలను కేంద్రం నోటీసుల ద్వారా ఫేస్బుక్ను అడిగింది.
షాకింగ్ న్యూస్: ‘కేంబ్రిడ్జ్ అనలిటికాకు కాంగ్రెస్ క్లైంటే'
అసలు విషయం తెలపండి..
ఫేస్బుక్ డేటా ఎప్పుడైనా దుర్వినియోగం జరిగిన దాఖలాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా భారత్ కోరింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమ మార్గాల ద్వారా జోక్యం చేసుకుంటే సహించబోమని ఫేస్బుక్కు భారత్ గత వారం తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
కఠిన చర్యలు తప్పవు
భారతీయ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది వాటిల్లినా ఫేస్బుక్పై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని, అవసరమైతే సమన్లు పంపుతామని కేంద్రం వెల్లడించింది. ఐదు కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బ్రిటన్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ ఉపయోగించుకుందని వచ్చిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. భారత్లోనూ ఈ వార్తలు కలకలం రేపాయి.