హార్దిక్ పటేల్ ఎక్కడ?: హైకోర్టు నోటీసులు, టెన్షన్
అహ్మాదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న యువ తరంగం హార్దిక్ పటేల్ కనిపించకుండా పోయాడు. దీంతో హార్దిక పటేల్ను గుజరాత్ పోలీసులే చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ హార్దిక్ పటేల్ సన్నిహితుడు దినేష్ పటేల్, కొందరు లాయర్లతో కలిసి మంగళవారం రాత్రి 1.20 హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ షా, జస్టిస్ కేజే థాకూర్లు వెంటనే హర్దిక్ పటేల్ను కోర్టు ముందు హాజరు పరచాలని రాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ హార్దిక్ పటేల్ను బుధవారం కోర్టు ముందు ఉంచాలని జడ్జి పోలీసు శాఖను ఆదేశించారు.
అంతక ముందు ఆరావళీ జిల్లాలో నిబంధనలనుక విరుద్ధంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన హర్దిక్ పటేల్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, తమ కళ్లు గప్పి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.
దీంతో గుజారత్ హైకోర్టు ప్రభుత్వానికి, డీజీపీకి, రేంజ్ ఇన్పెక్టర్ జనరల్, ఆరావళీ జిల్లా ఎస్పీకి హార్దిక్ పటేల్ ఎక్కడున్నాడో తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. హార్దిక్ ఎక్కడున్నారన్న విషయం ఆయన మిత్రులు, పటేల్ నేతలకు సైతం తెలియకపోవడంతో గుజరాత్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
హార్దిక్ పటేల్ ఎక్కడున్నారో తెలియదని, ఆయన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నామని జడ్జి ముందు వాదనలు వినిపించిన న్యాయవాది బీఎం మంగూకియా వ్యాఖ్యానించారు. ఆరావాళీ జిల్లాలో బయాద్ తాలుకాలో నిబంధనలకు విరుద్ధంగా హార్దిక్ పటేల్ బహిరంగ సభను నిర్వహించారు.
సభ అనంతరం హార్దిక్ పటేల్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఐజీ హాష్ముఖ్ పటేల్ అతడిని తప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు సైతం హార్దిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై మంగళవారం హార్దిక్ పటేల్తో సహా 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గుజరాత్లోని పటేళ్లను ఓబీసీ జాబితాలోకి చేర్చాలంటూ గత కొన్ని రోజులుగా హార్దిక్ పటేల్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.