ఇక చంద్రయాన్-3 పై దృష్టి సారించిన ఇస్రో... ఈ మిషన్ లక్ష్యమేంటి..?
బెంగళూరు: సోమవారం చంద్రయాన్ -2 ప్రయోగం విజయవంతం అయ్యాక 2024కు చంద్రయాన్-3ని పంపే యోచనలో ఇస్రో ఉన్నట్లు సమాచారం. చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని మట్టి, రాళ్ల శాంపిల్స్ను తిరిగి భూమికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇది జపాన్ సహకారంతో చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం జపాన్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
చంద్రయాన్-3కి 2017లోనే బీజం
నవంబర్ 2017లో బెంగళూరులో జరిగిన ఆసియా పసిఫిక్ రీజియనల్ స్పేస్ ఏజెన్సీ ఫోరంలో తొలిసారిగా చంద్రయాన్-3 గురించి దాని లక్ష్యం గురించి నాటి ఇస్రో చీఫ్ మరియు జపాన్ స్పేస్ ఏజెన్సీ చీఫ్లు సంయుక్త ప్రకటన చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది జపాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఇరు దేశాలు చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఒకరికొకరు సహకారం అందించుకునేలా చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఇండో-జపాన్ లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్కు సంబంధించిన చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే రెండు దేశాలు ఈ మిషన్పై ఎలా వర్కౌట్ చేయాలనేదానిపై చర్చలు జరుపుతున్నాయి. అంతరిక్ష రంగంలో ఇటు భారత్ అటు జపాన్ దేశాలు దూసుకుపోతున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంపై లోతైన చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు.
చంద్రయాన్-2తోనే ఇస్రో ఆగిపోకూడదు: డాక్టర్ చైతన్య గిరి
2022లో గగన్యాన్ మిషన్ పూర్తయిన తర్వాత ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు స్పేస్ అండ్ ఓషెన్ స్టడీస్ ప్రోగ్రామ్ ఆఫ్ గేట్వే హౌజ్ సభ్యులు డాక్టర్ చైతన్య గిరి తెలిపారు. చంద్రయాన్-2 చంద్రయాన్-3 లానే పనిచేస్తుందని చెప్పారు డాక్టర్ గిరి. ఆయన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తలపెట్టిన రొసెట్టా మిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తోక చుక్కలపై జపాన్, అమెరికాలలో చేపట్టిన ఈ ప్రయోగంలో ఆయన కూడా పనిచేశారు. చంద్రయాన్-2తో మాత్రమే ఇస్రో ఆగిపోకూడదని చెప్పిన డాక్టర్ చైతన్య గిరి... రాబోయే రోజుల్లో చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంకు మరో ఏడు మిషన్లను పంపే యోచనలో పలు అగ్రదేశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. అందుకే చంద్రుడిపై జరిగే ప్రతి చర్యా ముందుగానే చంద్రయాన్ -2 పసిగట్టేలా ఉండాలని ఆయన అన్నారు. అంటే చంద్రుడిపై మనిషి మనుగడ, ఇతర అంశాలపై పరిశోధనలు చేయాలని చెప్పారు.
చంద్రుడిపైకి రష్యాకు చెందిన లూనా 25
ఇదిలా ఉంటే 2024 నాటికి చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు అమెరికా సన్నద్దం అవుతోందని చెప్పిన గిరి... లూనా 25 లూనా 26 మిషన్తో చంద్రుడిపైకి రోబోను పంపాలని రష్యా భావిస్తున్నట్లు డాక్టర్ చైతన్య గిరి వెల్లడించారు. చాంగ్-4 మిషన్ను కొన్నేళ్ల క్రితం చంద్రుడిపైకి చైనా పంపిందని అయితే అది దక్షిణ ధృవ ప్రాంతానికి చాలా దూరంలో ఉందని అందుకోసమే చాంగ్-5ను దక్షిణ ధృవ ప్రాంతంలోకి ల్యాండ్ అయ్యేలా మిషన్ రూపొందిస్తోందని గిరి చెప్పారు. చాంగ్ -5 ద్వారా దక్షిణ ధృవ ప్రాంతం నుంచి మట్టి, రాళ్ల శాంపిల్స్ను భూమికి తీసుకువచ్చేలా చైనా మిషన్ రూపొందిస్తోందని తెలిపారు. ఆ తర్వాత మరిన్ని మిషన్లు అక్కడికి పంపేలా చైనా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చంద్రయాన్-3 రూపొందించాలి
చంద్రయాన్-3 నిర్మాణంను ఇస్రో త్వరగా చేపట్టాలని ఆయన సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ ఎకో సిస్టమ్ ద్వారా దీన్ని పూర్తి చేయాలని చెప్పారు. అయితే భారత అంతరిక్ష శాఖ ఇలాంటి మిషన్లు తయారీలో ఇస్రో ఒక్కదానిపై మీదే ఆధారపడకూడదని అది తన వ్యక్తిగత అభిప్రాయమని డాక్టర్ గిరి చైతన్య చెప్పారు. ఇక చంద్రయాన్-3 నిర్మాణంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో పాటు, పలు యూనివర్శిటీలు, స్టార్టప్ కంపెనీలు, రీసెర్చ్ ల్యాబులను కూడా భాగస్వామి చేస్తే మిషన్ త్వరగా పూర్తవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు డాక్టర్ చైతన్య గిరి.