కాశ్మీరీ అమ్మాయిలపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్: వారిని పెళ్లాడాలని తెగ ఉబలాటంగా ఉందట!
లక్నో: కాశ్మీరీ అమ్మాయిలపై భారతీయ జనతాపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. అందమైన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి తమ పార్టీ కార్యకర్తలు తెగ ఉబలాట పడుతున్నారని అన్నారు. తెల్లగా, అందంగా కనిపించే కాశ్మీరీ యువతులను వివాహమాడటానికి ఆర్టికల్ 370 రద్దు ఉపయోగ పడిందని చెప్పారు. ఇంతకుముందు ఆ సౌకర్యం ఉండేది కాదని చెప్పారు. ఇక బ్యాచిలర్లు కాశ్మీరీ అమ్మాయిలను స్వేచ్ఛగా పెళ్లి చేసుకోవచ్చని, ఎలాంటి అడ్డంకులు ఉండబోవని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత్ పై పాక్ ప్రధాని పిచ్చి కూతలు..పుల్వామా తరహా దాడులు కావాలా? అంటూ బెదిరింపులు
ఆ ఎమ్మెల్యే పేరు విక్రమ్ సింగ్ షైనీ. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజప్ఫర్ నగర్ కు చెందిన బీజేపీ నాయకుడు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కట్టబెడుతూ రూపొందించిన ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం వంటి చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ ముజప్ఫర్ నగర్ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ, బహిరంగ సభ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలువురు రాష్ట్రస్థాయి నాయకుల సమక్షంలోనే షైనీ.. కాశ్మీరీ అమ్మాయిలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీలో ఉన్న బ్యాచిలర్ కార్యకర్తలందరూ ఇక పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ కు చెందిన అందమైన అమ్మాయిలను వివాహమాడటానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. దీనికోసమైనా తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు కృతజ్నత చెప్పుకోవాలని అన్నారు. బ్యాచిలర్లు తమ బ్రహ్మచర్యాన్ని విడనాడి కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలు కోరుకున్న కాశ్మీరీ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తామని అన్నారు.
కాశ్మీరీ అమ్మాయిలు పొరుగు రాష్ట్రాలకు చెందిన యువకులను పెళ్లి చేసుకుంటే.. జమ్మూ కాశ్మీర్ లో వారి పౌరసత్వం రద్దయ్యేదని గుర్తు చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఆ సమస్య రాదని చెప్పారు. కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకునే అవకాశం దక్కడం వల్ల తమ పార్టీలో ఎవరైనా ముస్లిం కార్యకర్తలు ఉంటే వారు పండగ చేసుకోవచ్చని అన్నారు. తాను కాశ్మీర్ లో స్థిరపడతానని, అక్కడ ప్రతి ఒక్కరూ అందంగా కనిపిస్తారని చెప్పారు. అందాన్ని అనుభవించడానికైనా తాను జమ్మూ కాశ్మీర్ లో భూమిని కొనుగోలు చేసి, అక్కడే స్థిరపడతానని షైనీ అన్నారు.