వ్యక్తిగత ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కా?: మరో ధర్మాసనానికి 'ఆధార్'
ఆధార్కు సంబంధించిన కేసుల విచారణను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదలీ చేసింది.
న్యూఢిల్లీ: ఆధార్కు సంబంధించిన కేసుల విచారణను ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదలీ చేసింది.
ఆధార్ చెల్లుబాటు తదితర అంశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్, జస్టిస్ జెచలమేశ్వర్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
అయితే, మంగళవారం ఈ ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. వ్యక్తిగత ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందా? లేదా? అన్న అంశంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించి రేపటి నుంచి విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది.
మంగళవారం విచారణ సందర్భంగా వ్యక్తిగత ప్రైవసీ హక్కుకు సంబంధించి రెండు తీర్పులు చర్చకు వచ్చాయి.
1960లో జస్టిస్ కరఖ్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం, 1950లో జస్టిస్ ఎంపీ శర్మతో కూడి 8 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం వ్యక్తిగత ప్రైవసీ హక్కు ప్రాథమిక హక్కు కిందకు రాదని తేల్చిచెప్పాయి.
దీంతో ఈ అంశంపై చర్చ జరగాలంటే మరింతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అవసరమని భావించి.. 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసింది.