ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. ఇకపై తెలుగులో కూడా..!
ఢిల్లీ : సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ముఖ్యమైన తీర్పులు ఇకనుంచి తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఆ మేరకు ఇప్పటిదాకా సుప్రీంకోర్టు వెల్లడించిన వంద అతి కీలకమైన తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు. బుధవారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా తీర్పు కాపీలను విడుదల చేశారు. ఎన్నడూలేని విధంగా సుప్రీంకోర్టు తీర్పులు అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ఇకపై ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. సుప్రీం తీర్పులు రీజనల్ లాంగ్వేజేస్లో లభించనుండటంతో హర్షం వ్యక్తమవుతోంది.
వంద సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి అనువాద కాపీలను రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రపతి. ఇకపై అన్నీ ప్రధాన ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పు కాపీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇంగ్లీష్ అర్థం కాని లక్షలాది మందికి ఇవి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందీతో పాటు మరో ఐదు ప్రాంతీయ భాషలైన తెలుగు, అస్సామీ, కన్నడ, మరాఠీ, ఒరియా లాంగ్వేజేస్లో తీర్పులు వెలువడనున్నాయి.
సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయాన్ని రాష్ట్రపతి బుధవారం ప్రారంభించారు. పన్నెండు ఎకరాల సువిశాల స్థలంలో ఆరు బ్లాకులుగా అదనపు భవనాలు నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్, త్రివిధ దళాధిపతులు, పలువురు న్యాయమూర్తులు, సీనియర్ లాయర్లు హాజరయ్యారు.
Happy to receive and be introduced to translations of 100 important judgments of the Supreme Court. These will now be available in a variety of regional and Indian languages, and accessible to hundreds of millions of our fellow citizens who may not know English #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) July 17, 2019
ప్రాంతీయ భాషల్లో తీర్పులు అనువాదం చేసేలా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. ఇంగ్లీష్లో వెలువరించిన తీర్పులు అదే రోజున సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే ప్రాంతీయ భాషల్లో సదరు తీర్పులు వెబ్సైట్లో ఉంచడానికి వారం రోజుల సమయం తీసుకోనుంది.