శబరిమల : ఇకపై స్టీల్ బాటిళ్లలో ఔషధ జలం... బాటిల్ తిరిగిస్తే డబ్బులు రీఫండ్
శబరిమల అయ్యప్ప భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇకపై స్టీల్ బాటిళ్లలో అందించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఔషధ జలంతో కూడిన ఈ స్టీల్ బాటిల్స్ను పంబా బేస్ క్యాంప్ వద్ద భక్తులకు అందించనున్నారు. ఇందుకోసం పంబా కౌంటర్ వద్ద భక్తులు రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దర్శన అనంతరం స్టీల్ బాటిల్ను తిరిగి ఇస్తే డిపాజిట్ సొమ్మును భక్తులకు రీఫండ్ చేస్తారు.
స్టీల్ బాటిళ్లతో పాటు పేపర్ గ్లాసుల్లోనూ ఈ ఔషధ జలాన్ని అందించనున్నారు. పంబా బేస్ క్యాంప్తో పాటు చరల్మేడు,జ్యోతినగర్,మలికప్పురం పాయింట్స్ వద్ద ఈ జలాన్ని అందిస్తారు. సాధారణంగా ప్రతీ ఏటా శబరిమల యాత్రికులకు ఈ ఔషధ జలాన్ని అందిస్తారు. చుక్(ఎండు అల్లం),రామాచం(వెటివర్),పతిముఖమ్(పతంగకట్ట) మూలికలతో దీన్ని తయారుచేస్తారు. ఔషధ జలం పంపిణీ కోసం ప్రతీ కౌంటర్ వద్ద ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది ఉండనున్నారు. మొత్తంగా 55 మంది తాత్కాలిక ఉద్యోగులు ప్రతీరోజూ 8గంటలు ఇందుకోసం పనిచేయనున్నారు.ఔషధ జలం పంపిణీకి ధను ఎస్ కృష్ణన్ స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 16 నుంచి డిసెంబర్ 26 వరకు శబరిమలలో మండల పూజా కార్యక్రమం జరగనుంది. కరోనా నేపథ్యంలో శబరిమల వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనల్ని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు ఇదివరకే ప్రకటించింది. వారంలో ఐదు రోజులు రోజూ 1,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. శనివారం, ఆదివారం మాత్రం 2,000 చొప్పున భక్తుల్ని అనుమతిస్తున్నారు. మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో దైవ దర్శనానికి 5,000 మంది భక్తుల్ని అనుమతించనున్నారు. ఇప్పటికే డిసెంబర్ వరకు క్యూ స్లాట్స్ బుక్ అయ్యాయి.