ఇంద్రాణీకి మరిన్ని చిక్కులు: పెదవి విప్పిన షీనా ఓనర్
ముంబై: షీనా బోరా హత్య కేసులో... ప్రధాన నిందితురాలు అయిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా మరింత చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, షీనా బోరా - ప్రియుడు రాహుల్ కలిసి అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని.. షీనా సంతకం విషయమై మాట్లాడాడు.
రెంట్ అగ్రిమెంట్ను ఆపేద్దామని షీనా బోరా మెయిల్ చేసిన కాగితాల్లో సంతకానికి, ఆమె గతంలో చేసిన సంతకానికి తేడా ఉందని అతను చెప్పాడని తెలుస్తోంది. ఈ విషయమై మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాము ఖాళీ చేస్తున్నామని రాహుల్ చెప్పాడని, మరోవైపు షీనా కనిపించలేదని, దీంతో మేం షీనాకు ఓ మెయిల్ పంపించామని, రెంట్ అగ్రిమెంట్ను ఆపేద్దామని ఓ ఫ్యాక్స్ చేయాలని ఆమెకు సూచించామని సదరు యజమాని మీడియాతో చెప్పాడు.
దీంతో, తమకు జూలై మధ్యలో ఓ మెయిల్ వచ్చిందని, అయితే అంతకుముందు ఆమె చేసిన సంతకాలకు, ఈ సంతకాలకు పోలిక లేదని చెప్పాడు. ఈ విషయమై తాను స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత ఈ కేసులో ఏమైనా పురోగతి ఉందా అనే విషయమై తాను ఆరా తీయలేదని చెప్పాడు. మరోవైపు, పీటర్ ముఖర్జీయాకు కస్టడీని పొడిగించారు. డిసెంబర్ 14వ తేదీ వరకు కస్టడీని పొడిగించారు.