ఏఆర్ రెహ్మాన్కు ఆధిత్యనాథ్ ఘర్ వాపసీ ఆఫర్
లక్నో: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ హిందూమతంలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తామని, ఆయన పైన ఫత్వా జారీ చేయడం హాస్యాస్పదమని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం అన్నారు.
ఆయన ఏఆర్ రెహ్మాన్కు ఘర్ వాపసీ ఆఫర్ ఇచ్చారు. ఇరానీ సినిమా ముహమ్మద్.. మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ఏఆర్ రెహ్మాన్ సహా యూనిట్ మొత్తంపై ముంబైకి చెందిన ముస్లిం మత సంస్థ రజా అకాడమీ ఫత్వా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో గోరఖ్పూర్లో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. ఏఆర్ రెహ్మాన్ తిరిగి హిందూమతంలోకి వస్తే స్వాగతం పలుకుతామన్నారు. రెహ్మాన్పై ఫత్వా విధించడం హాస్యాస్పదమన్నారు. రెహ్మాన్ గతంలో హిందువు. దీంతో, ఆయనను తిరిగి హిందూమతంలోకి రావాలని కోరుతున్నారు. ఇంతకుముందు ఓ విశ్వహిందూ పరిషత్ నేత ఇదే విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీకి వెంకయ్య చురకలు
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వార్తల్లో నిలిచేందుకే ప్రధాని నరేంద్ర మోడీపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు చిన్నపిల్లాడి మాటల్లా, అపరిపక్వంగా ఉన్నాయన్నారు.
బీహార్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం సూట్ బూట్ ప్రభుత్వమని, ఆయన సంసన్నులకే తప్ప.. పేదవారికి కోసం పని చేయరని ఆరోపించారు. దీనిపై వెంకయ్య కౌంటర్ ఇచ్చారు.
మోడీ సూట్ బూట్ అంశాన్ని ప్రస్తావిస్తున్న రాహుల్కు.. తన తాత నెహ్రూ, తండ్రి రాజీవ్ గాంధీ కూడా సూట్ బూట్ ధరించిన అంశం గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. దీనిని బట్టి నెహ్రూను, రాజీవ్ను కూడా రాహుల్ విమర్శిస్తున్నట్లేనా? అని అన్నారు.
ప్రధానికి ఆ సూట్ బహుమతిగా వచ్చిందని, దానిని వేలం కూడా వేసి ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆ నిధులను వెచ్చించామనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. రాహుల్కు అంగుళం అంటే ఏమిటో తెలుసా అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో భూసేకరణ చట్టం దుర్వినియోగమైందన్నారు.
మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ ఒప్పందాల వంటి అభివృద్ధిని కాంగ్రెస్ కోరుకుంటున్నదా? అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. మోడీది మేక్ ఇన్ ఇండియా అయితే యూపీఏ హయాంలో టేక్ ఇన్ ఇండియా పాలన జరిగిందన్నారు.