NRC,NPR : పార్లమెంటులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక వ్యాఖ్యలు, ఏం చెప్పారంటే..
జాతీయ పౌరసత్వ పట్టిక(NRC) చట్టాన్ని ఇప్పట్లో దేశవ్యాప్తంగా అమలుచేసే ఆలోచన లేదని కేంద్ర హోంశాఖ మంగళవారం పార్లమెంట్లో స్పష్టం చేసింది. అంతేకాదు,జాతీయ జనాభా పట్టిక(NPR)ను అమలుచేసే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్చ ఉంటుందని.. అదేమీ తప్పనిసరికాదని స్పష్టం చేసింది. ఎన్పీఆర్కు,ఎన్ఆర్సీకి సంబంధం లేదని తెలిపింది. బడ్జెట్ సెషన్ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాలపై స్పష్టతనిచ్చింది.
డీ ఓటర్స్ గురించి ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ
ఎన్పీఆర్ ప్రక్రియలో డి ఓటర్లను(డౌట్ఫుల్ ఓటర్స్) జనాభా రిజిస్టర్ నుంచి వేరు చేస్తే.. అప్పుడు పరిస్థితేంటని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ 'ఎన్పిఆర్ అప్డేట్ ప్రక్రియలో ఎవరి పౌరసత్వం సందేహాస్పాదంగా ఉందన్న దానిపై ఎలాంటి ధ్రువీకరణ జరగదు.' అని తెలిపారు.
ఎన్పీఆర్ కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సేకరించరు..
మరో కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ అడిగిన ఓ ప్రశ్నకు.. ఆధార్ సమర్పించడం తప్పనిసరికాదని నిత్యానంద రాయ్ తెలిపారు. పౌరులు విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే ఎన్పీఆర్ కోసం ఇవ్వాలని తెలిపారు. ఒకవేళ ఆధార్,పాస్పోర్ట్,ఓటర్ ఐడీలను ఎన్పీఆర్కు ప్రభుత్వం తప్పనిసరి చేస్తే ఎలా అని సురేష్ ప్రశ్నించారు. అలాంటిదేమీ ఉండదని.. ఎన్పీఆర్ కోసం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను సేకరించబోమని
వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో చర్చలు..
కొన్ని రాష్ట్రాలు ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్నాయని.. దాని సంగతేంటని ముగ్గురు ఎంపీలు అదూర్ ప్రకాశ్,ప్రసూన్ బెనర్జీ,ఎంపీ రేవంత్ రెడ్డి హోంమంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఎన్పీఆర్ను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని నిత్యానంద రాయ్ తెలిపారు. ఇక నేషనల్ రిజిస్ట్రేషన్ ఐడెంటిటీ కార్డుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇటీవల కేసీఆర్ కూడా ఎన్పీఆర్పై..
ఇటీవల తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్పీఆర్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక కోసం ఇచ్చే సమాచారం స్వచ్చందమే కానీ తప్పనిసరి కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కిషన్ రెడ్డి అన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. తప్పనిసరి కానప్పుడు. అమలుచేయడమెందుకు అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు మేమేమీ చెప్పాలని నిలదీశారు.