కలకలం: మూర్తి లేఖతో ఇన్ఫోసిస్ లో మళ్లీ చెలరేగిన వివాదం
బెంగళూరు : మరోసారి సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, దాని వ్యవస్థాపకులకు మధ్య వివాదం మొదలైంది. పనాయా కొనుగోలుకు సంబంధించిన విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలంటూ ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల బోర్డు సభ్యులకు రాసిన లేఖతో మళ్లీ వివాదాలు చెలరేగాయి.
200 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పనాయా విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఆరోపించింది. సెబీ ఆరోపణలపైనా, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో తలెత్తిన వివాదం విషయంలోనూ, ప్రస్తుత సీఈవో అత్యధికమైన వ్యయాల ఆరోపణల విషయంలోనూ కంపెనీ అంతర్గతంగా విచారణ చేపట్టింది.

జూన్లోనే వీటిపై కంక్లూజన్ అండ్ సమ్మరీ ఫైండింగ్ స్టేట్మెంట్ను ప్రచురించింది. పనాయా కేసు, సీఈఓ వ్యయాలు వంటి విషయంలో వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిర్థారణ లేదని గిబ్సన్ డన్ అండ్ క్రుచర్ అనే న్యాయ సంస్థ కూడా పేర్కొంది.
అయితే దీనికి సంబంధించి మొత్తం రిపోర్టులను బహిర్గతం చేయాలని ఇప్పుడు నారాయణమూర్తి డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ రిపోర్టును అందించాలని ఆయన కోరుతున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
అయితే ఈ రిపోర్టును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు కంపెనీ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ రిపోర్టును బహిర్గతం చేస్తే, పనాయా ఇన్వెస్టర్లకు, దాని లిమిటెడ్ పార్టనర్లకు మధ్యనున్న క్లయింట్ రహస్యమైన ఒప్పందాలను ఉల్లంఘించినట్టు అవుతుందని కంపెనీ పేర్కొంటోంది.
ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కొనుగోలుచేసిన వాటిలో పనాయా అతిపెద్ద డీల్. దీంతో మరోసారి కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఇన్ఫోసిస్ బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు వివాదం తలెత్తినట్టు తెలిసింది.