amith shah:దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు: అమిత్ షా, బెంగాల్లో కాదన్న దీదీ
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అసోంలో జాబితా రూపొందించామని.. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. జాబితాలో పేర్లు లేని ఆయా వర్గాలు ఆందోళన చెందొద్దని దేశంలో ఏ మూలానైనా విదేశీయులు ఉంటే వారిని స్వదేశానికి సాగనంపుతామని స్పష్టంచేశారు.
ఇలా చొరబడ్డారు..
1971 మార్చి 25వ తేదీన బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి చొరబడ్డారు. వారి జాబితాను ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేసింది. జాతీయ పౌరసత్వ రిజిష్టర్లో 19 లక్షల మందికి చోటు లభించలేదు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. బుధవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. అసోంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని స్పష్టంచేశారు. దీంతో మిగతా వ్యక్తులు, సంస్థలు ఆందోళన చెందొద్దని తేల్చిచెప్పారు. విదేశీయులకు దేశంలో చోటులేదని అమిత్ షా స్పష్టంచేశారు.
అప్పీల్ చేయండి
జాబితాలో లేని వారు ట్రైబ్యునల్ అప్పీల్ చేసుకోవచ్చని అమిత్ షా సూచించారు. పిటిషన్ వేసుకోలేని వారికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని తెలిపారు. వారి తరఫున లాయర్ను కేటాయిస్తుందని తెలిపారు. దీనిపై వారు తమ వాదనలను వినిపించుకోవాలని సూచించారు.
బెంగాల్లో కాదు..
అసోంలో అమలుచేసిన ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన వెంటనే టీఎంసీ చీప్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ దేశవ్యాప్తంగా అమలు చేయండి.. కానీ అందుకు బెంగాల్ మినహాయింపు అని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో బెంగాల్లో అమిత్ షా ర్యాలీతో దీదీకి షా మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజాగా ఎన్ఆర్సీ అమలుచేస్తామని షా స్పష్టంచేయడంతో.. వెంటనే దీదీ ఖండించారు.
కూల్.. కూల్
మరోవైపు జమ్ముకశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయని చెప్పారు. షాపులు కూడా సాయంత్రం వరకు తెరుచుకునే ఉంటున్నాయని చెప్పారు.
విద్యార్థుల సందడి
పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యారు. దాదాపు మూడునెలల తర్వాత చిట్టి, పొట్టి చిన్నారులు స్కూళ్ల బాట పట్టారు. పరీక్షలు సమీపిస్తోన్న కొద్దీ స్కూళ్లు తిరిగి తెరచుకోవడంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. సాధారణంగా తమ హాజరుశాతం 90 శాతం ఉంటుందని.. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.