ఎన్ఆర్ఐ భర్త అరాచకం.. భార్య నగ్న ఫోటోలు తీసి.. కట్నం కోసం బ్లాక్మెయిల్
చండీఘర్ : కట్టుకున్న భార్యను వంచించాడు షాడిస్ట్ ఎన్ఆర్ఐ భర్త. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసి.. పచ్చని పందిరిలో జీవితాంతం తోడుంటానని బాసలు చేసినోడు చివరకు తన వక్రబుద్ధి బయటపెట్టాడు. విదేశాల్లో ఉంటున్న సదరు భర్త.. భార్యను తన వెంట తీసుకెళ్లకుండా సొంతూరులోనే ఉంచాడు. అక్కడినుంచే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కావాలంటూ నరకం చూపించేవాడు. ఆ క్రమంలో భార్య నగ్న ఫోటోలు తీసుకుని అదనపు కట్నం తేవాలంటూ మనసులోని మాట బయటపెట్టి బ్లాక్మెయిల్కు దిగాడు. భర్త షాడిస్ట్ లెక్కలు భరించలేని ఆ ఇల్లాలు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో అతగాడిపై కేసు నమోదైంది.
కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకుని.. ఎన్ఆర్ఐ సంబంధంతో బోల్తా
పంజాబ్లోని మోగ పట్టణం బసంత్ నగర్ వాసి బల్దేవ్ సింగ్ తన కూతురు రమణ్ దీప్ కౌర్ పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. ఆ క్రమంలో ఎన్ఆర్ఐ సంబంధం రావడంతో వరుడు జర్నౌల్ సింగ్తో 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి బిడ్డ వివాహం చేశారు. 10 లక్షలు తక్కువ కావడంతో ఇంటి కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ ఘనంగా పెళ్లి జరిపించారు. బంధు మిత్రుల సమక్షంలో గతేడాది ఫిబ్రవరి 11న అంగరంగంగా మ్యారేజ్ జరిగింది. అంతవరకు బాగానే ఉన్నా.. పెళ్లి తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. అత్తింటి నుంచి అదనపు కట్నం వేధింపులు తప్పలేదు.
పోర్చుగల్లో ఉద్యోగం.. భార్య సొంతూరిలో.. ఆగని వేధింపులు
ఉద్యోగ నిమిత్తం పోర్చుగల్లో ఉండే జర్నౌల్ సింగ్.. పెళ్లి తర్వాత భార్యను తన వెంట తీసుకెళ్లలేదు. పైగా అక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడల్లా అదోలా మాట్లాడేవాడు. అయితే అతడి మనసులోని మరో కోణాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అయితే ఒక రోజు వీడియో కాల్ చేసిన జర్నౌల్ సింగ్.. భార్యను నగ్నంగా మారాలని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఏవేవో మాటలు చెప్పి భయభ్రాంతులకు గురిచేశాడు. దాంతో ఆమె భర్తే కదా అని అతడు చెప్పినట్లే చేసింది. పూర్తి వివస్త్రగా మారిన క్షణంలో ఆమె ఫోటోలు స్క్రీన్ షాట్గా తీసుకున్నాడు.
భార్య నగ్న ఫోటోలు తీసుకుని.. అదనపు కట్నం కోసం వేధింపులు
భార్య నగ్న ఫోటోలు చేతిలో పడ్డాక అసలు రూపం బయటపెట్టాడు. తన మనసులోని కోరిక ఆమె ముందుంచాడు. అదనపు కట్నం తీసుకొస్తే సరి.. లేదంటే ఆ ఫోటోలు బయటపెడతా అంటూ బ్లాక్మెయిల్ చేశాడు. బంధుమిత్రులందరికీ ఆ ఫోటోలు షేర్ చేస్తానంటూ భయపెట్టించేవాడు. భర్త మారుతాడేమోనని వెయిట్ చేసిన ఆమెకు కన్నీళ్లే మిగిలాయి. చాలా రోజులు భర్త చేష్టలు మౌనంగా భరించిన రమణ్ దీప్ కౌర్ చివరకు ఆ సైకో గాడి వేధింపులు తట్టుకోలేక విషయం కాస్తా తండ్రితో పంచుకుంది. కూతురి కన్నీళ్లు చూసిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులకు ఫిర్యాదు.. స్వగ్రామానికి రావడంతోనే అరెస్ట్
రమణ్ దీప్ కౌర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు కట్నం కేసుతో పాటు బ్లాక్మెయిల్ నేరం కింద కూడా మరో కేసు ఫైల్ చేశారు. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. భర్తకు తోడుగా అతడి కుటుంబ సభ్యులు తనను వేధించేవారని పోలీసులకు వివరించారు. జులై 2వ తేదీన నమోదైన ఈ కేసులో నిందితుడు జర్నౌల్ సింగ్ కోసం పోలీసులు వెయిట్ చేశారు. అతడు స్వగ్రామానికి తిరిగొచ్చిన క్రమంలో వెంటనే అరెస్ట్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.