ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: ట్రయల్స్లో స్వచ్చందంగా పాల్గొన్న భారత సంతతి వ్యక్తి..ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ గొప్ప కార్యం జరిగినా అది ఏదేశంలో జరిగినా సరే.. మన భారతీయుల పాత్ర ఉండకనే ఉంటుంది. తాజాగా కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు భారత్తో సహా పలు దేశాలు వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించాయి. ఇక తాజాగా ఆక్స్ఫర్డ్ ప్రకటించిన వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తున్నాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని కూడా ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. దీంతో ఈ మహమ్మారిపై విజయం సాధించే దిశగా ప్రపంచం అడుగులు ముందుకు పడుతున్నాయనేది చాలామందికి ఒక ఆశను కలిగించింది. ఇక ఈ వ్యాక్సిన్ను వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించిన సందర్భంగా అందులో ఒక భారతీయుడిపై కూడా పరీక్షలు నిర్వహించారు. ఇంతకీ ఎవరతను..?
Recommended Video
ట్రయల్స్లో పాల్గొన్న దీపక్
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దీనికి విరుగుడుగా వ్యాక్సిన్ను కనిపెట్టింది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ. ప్రస్తుతం వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించింది. అయితే ఒక భారతీయుడిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రయోగించడం జరిగింది. ఆయన పేరు దీపక్ పలివాల్. యూకేలో ఓ ఫార్మా కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు 42 ఏళ్ల దీపక్. ఇక ట్రయల్స్కు తను ఒప్పుకున్నట్లు కుటుంబంతో చెప్పగానే ముందుగా వారు కాస్త ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు దీపక్. తన భార్యతో సహా తన కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారని గుర్తు చేసిన దీపక్... ఈ మహమ్మారిని పారదోలి ప్రపంచానికి విముక్తి కల్పించడంలో తన పాత్ర ఉండాలని భావించి వ్యాక్సిన్ను తనపై ప్రయోగించాల్సిందిగా కోరినట్లు చెప్పారు. ఈ క్రమంలో తన ప్రాణాలు పోయిన తనకు సంతోషమే అని దీపక్ చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు స్వచ్చందంగా వెళ్లాను
ఏప్రిల్ 16వ తేదీన వ్యాక్సిన్ తీసుకునేందుకు స్వచ్చందంగా వచ్చిన 1000 మందిలో ఒకే ఒక భారతీయుడిగా దీపక్ ఉన్నారు. ఏప్రిల్ 16వ తేదీన వ్యాక్సిన్కు సంబంధించి రెండు దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. ఇక వాలంటీర్లపై చేసిన వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్ అయ్యిదని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించగానే దీపక్ పలివాల్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్ అయ్యాక ఇందులో భాగమైనందుకు తనకు ఎంతో గర్వంగా ఉన్నట్లు దీపక్ చెప్పారు. అంతేకాదు తన భార్యతో పాటు తన కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేసినట్లు దీపక్ చెప్పారు.
చాలా మంది చాలా చెప్పారు
అప్పటి వరకు ఈ వ్యాక్సిన్ను జంతువులపై మాత్రమే ప్రయోగించారని ఆ తర్వాత మానవుడిపై ప్రయోగిస్తున్నారని తెలిసి కాస్త ఆలోచించానని చెప్పారు దీపక్. అంతేకాదు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అది తన సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని కొందరు హెచ్చరించారని చెప్పిన దీపక్... మరికొందరైతే వ్యాక్సిన్ పేరుతో ఒక చిప్ ఇన్సర్ట్ చేసి తన కదలికలపై నిఘా ఉంచుతారని చెప్పినట్లు దీపక్ వెల్లడించారు. ఇక తనకు తెలిసిన కొందరు పరిశోధకులు మాత్రం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్-19 బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరించినట్లు చెప్పారు. మొత్తానికి స్వచ్చందంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న దీపక్ భారత్లో ఏప్రాంతానికి చెందినవాడంటే రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్కు చెందినవాడు.