డ్రాగన్ తోకముడవటం వెనుక: అజిత్ దోవల్ మంత్రాంగం: చైనా విదేశాంగ మంత్రికి ఫోన్: 24 గంటల్లో ఖాళీ
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్విన చైనా.. ఒక్కసారిగా తోక ముడవటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైన్యాధికారులు ఉన్నట్టుండి తన బలగాలను వెనక్కి పిలిపించుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఆరా తీస్తున్నారు దేశ ప్రజలు. కేంద్రం ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే విషయంపై దృష్టి సారించారు.
రెండు కిలోమీటర్లు వెనక్కి..
సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని భారత్తో ఢీ అంటే ఢీ అంటూ యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటోన్న చైనా ఒక్కసారిగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన వేలాదిమంది సైనికులను వెనక్కి పిలిపించింది ఆ దేశ రెడ్ ఆర్మీ. సైనిక శిబిరాలను సైతం ఒక్కటొక్కటిగా తొలగిస్తోంది. వివాదాస్పద ప్రదేశాలను ఖాళీ చేసింది. వాస్తవాధీన రేఖ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వెనక్కి వెళ్లాయి పీఎల్ఏ బలగాలు.
ఫోన్లో రెండు గంటల పాటు మాట్లాడిన అజిత్ దోవల్
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని వెల్లడించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. ఆదివారం చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్యీతో టెలిఫోన్లో సంభాషించారని స్పష్టం చేసింది. అజిత్ దోవల్-వాంగ్యీ మధ్య సుమారు రెండు గంటల పాటు టెలిఫోన్ సంభాషణ కొనసాగిందని, వారిద్దరూ కొన్ని కీలక అంశాలపై చర్చించారని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
ఇద్దరి మధ్య ఇన్-డెప్త్గా
అజిత్ దోవల్, వాంగ్యీ మధ్య ఇన్-డెప్త్గా చర్చలు కొనసాగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. లఢక్ వద్ద చోటు చేసుకున్న సరిహద్దు వివాదాలే వారిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిపారు. అజిత్ దోవల్తో టెలిఫోన్ సంభాషణ కొనసాగించిన తరువాతే.. చైనా తన వైఖరిని మార్చుకుందని, దూకుడును తగ్గించుకుందని స్పష్టం చేశారు. టెలిఫోన్ సంభాషణ ముగిసిన 24 గంటల వ్యవధిలోనే చైనా తన బలగాలను ఉపసంహరంచుకుందని తెలిపారు.
వాస్తవాధీన రేఖ నుంచి
వాస్తవాధీన రేఖ వెబండి నుంచి మొదటిసారిగా తామే వెనక్కి తగ్గుతామని చైనా విదేశాంగ శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా- వాస్తవాధీన రేఖ నుంచి పీఎల్ఏ బలగాలు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లాయి. చైనా సైనికుల నిర్ణయానికి అనుగుణంగా భారత్ జవాన్లు కూడా వివాదాస్పద ప్రదేశాల నుంచి వెనక్కి వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. తాము కూడా బలగాలను ఉపసంహరించుకుంటామని ఈ సందర్భంగా అజిత్ దోవల్ స్పష్టం చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా..
భారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా, సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని వాంగ్యీ స్పష్టం చేశారని అధికారులు పేర్కొన్నారు. రెండు వైపులా వాస్తవాధీన రేఖను ఖాళీ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వాంగ్యీ ప్రతిపాదించగా.. దానికి అజిత్ దోవల్ అంగీకరించారని తెలిపారు. రెండు దేశాలు కూడా పరస్పరం గౌరవించుకుంటూ బలగాలను వెనక్కి తీసుకోవడానికి వారిద్దరూ ఒప్పుకొన్నారని చెప్పారు.